Sunday, July 3, 2022

అల్లూరి ఇంటర్వూ

 అల్లూరి సీతారామరాజుతో జరిపిన ఏకైన ఇంటర్వ్యూ ఇది. 1923, ఏప్రిల్‌ 17న అన్నవరంలో చిలుకూరి నరసింహమూర్తి జరిపిన ముఖాముఖి ఇది. ఇది నాలుగు రోజుల తరువాత అంటే ఏప్రిల్‌ 21న పత్రికలో ప్రచురితమైంది.

నరసింహ : ఎంతకాలం మీరిక్కడ ఉంటారు?
అల్లూరి : రెండు గంటలు మాత్రమే. మేము ఉదయం 10 గంటలకు బయల్దేరతాం. కాకినాడ, నర్సీపట్నం పోలీసులకు నా సమాచారం పంపించడానికి పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌కు కనీసం అర్ధగంట సమయం పడుతుంది. వాళ్లంతా ఈ గ్రామం వచ్చేసరికి పది గంటలు కావచ్చు.
నరసింహ : ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారు?
అల్లూరి :
 నా తరువాత క్యాంపును నేనింకా నిర్ణయించుకోలేదు.
నరసింహ : ఈ ఉద్యమం వెనుక ఉన్న మీ ఆశయం ఏమిటి?
అల్లూరి :
 మన ప్రజలకు స్వాతంత్య్రం తీసుకురావడం.
ఈ లక్ష్యాన్ని సాధించడానికి మీరెన్నుకున్న ఆయుధం ఏమిటి?
అల్లూరి : విప్లవం ద్వారా మాత్రమే మా లక్ష్యాన్ని సాధించగలం. రెండేళ్లలో స్వాతంత్య్రం సాధించగలమన్న నమ్మకం నాకు ఉంది.
నరసింహ: ఎలా సాధ్యం.. మీరెన్నుకున్న మార్గం ద్వారా?
అల్లూరి :
 కచ్చితంగా. నా అనుచరులు అధిక సంఖ్యలో ఉన్నారు. మాకు ఇప్పుడు ఆయుధాలు కావాలి. అందుకే నా పర్యటన.
నరసింహ: ప్రపంచం మొత్తం హింస, విప్లవాలతో విసిగిపోయింది. ప్రతి ఒక్కరూ అహింస వైపు మొగ్గు చూపుతున్నారు. మనం గాంధీజీ సిద్ధాంతాలను నమ్ముతున్నాము.
అల్లూరి : అహింసలో మాకు నమ్మకం లేదు. హింస ద్వారానే స్వాతంత్య్రం వస్తుందని నేను గట్టిగా నిర్ణయించుకున్నాను. మేము చేపట్టిన ఐదు యుద్ధాలలో విజయాలే సాధించాం. ఈసారి మేము గాఢ విశ్రాంతిలో ఉండగా, పోలీసులు దాడి చేశారు. అప్పుడు మేము తప్పించుకోగలిగాము.
... చివరలో నరసింహమూర్తి రాస్తూ అల్లూరి సీతారామరాజు స్వచ్ఛమైన ఇంగ్లీషు, తెలుగు భాషల్లో మాట్లాడారని ముగించారు.



ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంలో అల్లూరి కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆవిష్కరించారు. ఆ స్వాతంత్ర్య సమరయోధుడి వీరోచిత పోరాటాన్ని జనులందరికీ చాటి చెప్పారు. అంతటి గొప్ప వీరుడిని ఆ ఒక్క రోజు గుర్తుచేసుకుంటే సరిపోతుందా..? ఆయన జ్ఞాపకాలను పదిలపరుచుకోవాల్సిన అవసరం లేదా..? మన తెలుగు బిడ్డ అల్లూరి సీతారామరాజు స్వహస్తాలతో రాసిన లేఖలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వానికి లేదా..? ఆ లేఖలను డిజిటలైజ్ చేసి ఆన్‌లైన్‌లో పదిలపరిస్తే సరిపోతుందా..?

బానిస సంకెళ్ల నుంచి దేశానికి విముక్తి కలిగించిన అల్లూరి లాంటి గొప్ప దేశ భక్తుల గురుతులను నిర్లక్ష్యం చేయడం ఎంతవరకూ సమంజసం..? విగ్రహ ఆవిష్కరణలో పాలుపంచుకున్న ప్రభుత్వం అల్లూరి స్వదస్తూరి లేఖలను, ఆయన జ్ఞాపకాలను విస్మరించడం బాధ్యతారాహిత్యం కాదా..? మన్నెం వీరుడు అల్లూరి సీతారామ రాజు జ్ఞాపకాలను ఇకనైనా సంరక్షించుకోవాల్సిన అవసరం లేదా..? అల్లూరి అభిమానులు ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం నిరీక్షిస్తున్నారు.

తార్నాకలోని ఆంధ్రప్రదేశ్ రాజ్యాభిలేఖ పరిశోధనాలయంలో అల్లూరి సీతారామరాజు రాసిన లేఖలు, ఆ సమయంలో అల్లూరిని అప్పగిస్తే పారితోషికం ఇస్తామని బ్రిటీష్ ప్రభుత్వం చేసిన ప్రకటనలు, జీవోలు కనీస గుర్తింపుకు నోచుకోకుండా అక్కడ ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 14-06-1922న పైడిపుట్ట గ్రామం నుంచి శ్రీ చెక్కా లింగం దొరకు రాసిన లేఖ గురించి. అచ్చ తెలుగులో అల్లూరి రాసిన ఈ లేఖ చదివితే ఆయన దయా గుణం, ఔదార్యం ఏంటో అర్థమవుతుంది. తాను నేపాల్ వెళ్లాలని నిర్ణయించుకున్నానని, పైడిపుట్టలో తన 50 ఎకరాలను మీ ఇష్టం వచ్చిన వారికి ఇవ్వవచ్చని తృణప్రాయంగా తన భూమిని ఇచ్చేసిన గొప్ప ఉదారవాది అల్లూరి సీతారామరాజు.

తన తల్లి, సోదరుడిని 1922 జూన్‌లో నర్సాపురానికి సీతారామరాజు పంపించారు. ఈ సందర్భంగా తన తల్లి ప్రయాణం గురించి అప్పటి గూడెం తాలూకా డిప్యూటీ తహసీల్దార్ బాస్టిన్‌కు ఆంగ్లంలో అల్లూరి లేఖ రాశారు. ఆ లేఖ కూడా ఆర్కైవ్స్‌లో ఉంది. పెన్సిల్‌తో ఆ లేఖ రాసినట్టుగా ఉంది.

అల్లూరి సీతారామరాజుని పట్టుకుంటె రూ 1500_0_0 యినాము, గనర్ణపాలెము గ్రామం కాపరస్తుడు గాంమల్లుదొర, గాంగంటం దొరను పట్టుకుంటె ఇద్దరికీ చెరో రూ 1000_0_0 చొప్పున యినాము ఇస్తామని బ్రిటీష్ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన కూడా తార్నాకలోని ఆంధ్రప్రదేశ్ రాజ్యాభిలేఖ పరిశోధనాలయంలో ఉంది.

1937లో పొన్నలూరి రాధాకృష్ణమూర్తి '1922 మన్యంలో రైతుల తిరుగుబాటు (అల్లూరి సీతారామరాజు) పేరుతో ఒక పుస్తకాన్ని రాశారు. అల్లూరికి సంబంధించిన ఎన్నో విషయాలను ఈ పుస్తకం ద్వారా ఆయన వెలుగులోకి తెచ్చారు. అయితే.. ఈ పుస్తకంలోని అంశాలు మన్యం ప్రాంతంలోని శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని ఈ పుస్తకాన్ని నిషేధిస్తూ ఆగస్ట్ 24, 1938న G.O. No.1451ను 'గవర్నమెంట్ ఆఫ్ మద్రాస్' పేరుతో బ్రిటీష్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ప్రకటన తాలూకూ జీవో కూడా ఆర్కైవ్స్‌లో అందుబాటులో ఉంది.

ఇంత విలువైన జ్ఙాపకాల సంపదను ఒక ప్రదర్శనశాలలో గానీ, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా మరే విధంగానైనా చేరువచేసేలా చర్యలు తీసుకోవాలని అల్లూరి అభిమానులు కోరుకుంటున్నారు. మన్యం ప్రాంతంలో ఉండే వారికి అల్లూరి జ్ఙాపకాలను అందుబాటులో ఉంచాలని విశాఖ జిల్లాకు చెందిన ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నారు.




*బ్రిటిషర్ల గుండెల్లోకి దూసుకుపోయిన విప్లవ బాణం స్వాతంత్య్ర సమరయోధుడు.*

*అలూరి సీతారామరాజు జయంతి: జులై 04*


🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹


అల్లూరికి తుపాకీ పేల్చడం / కాల్చడం నేర్పిన గురువు " షేక్ మదీనా " ను కూడా మర్చిపోయాం !!!

===

మన్యవిప్లవ యోధులు శ్రీ అల్లూరి సీతారామరాజు కు తుపాకీ పట్టడం, గురిపెట్టి పేల్చడం / కాల్చడం నేర్పిన గురువు షేక్ మదీనా. 

అయన తూర్పుగోదావరి జిల్లా   పెద్దాపురం గ్రామస్థులు.  బ్రిటిష్ ప్రభుత్వం లోని పొలీసు శాఖలో అయన పనిచేశారు. పదవీ విరమణ చేసి 65 ఏండ్ల వయస్సులో పెద్దాపురంలో విశ్రాంత జీవితం గడుపుతున్నారు. 

 షేక్ మదీనా గురించి తెలిసిన యువకులు  అల్లూరి సీతారామరాజు తన సహచరులు  రేగరాజు,  పేకేటి సుబ్బరాజు తదితరులతో కలసి పెద్దాపురం విచ్చేసారు. 


అల్లూరి సీతారామరాజు పెద్దాపురంలో షేక్ మదీనా వద్ద తుపాకీ పేల్చడం నేర్చుకున్నారు. ఆ విధంగా తుపాకి పేల్చడంలో / కాల్చడంలో మదీనా నుండి అల్లూరి పొందిన శిక్షణ ఆంగ్లేయ బలగాలకు నిద్రలేకుండా చేసిన  మన్యం పోరాటంలో ఎంతో ఉపయోగపడింది. 


===


షేక్ మదీనా నుండి అల్లూరి సీతారామరాజు తుపాకి కాల్చడం / పేల్చడం లో పొందిన శిక్షణ విశేషాలను ప్రముఖ రచయిత, సీనియర్ పాత్రికేయులు డాక్టర్ గోపరాజు నారాయణరావు గారు "ఆకుపచ్చ సూర్యోదయం - మన్యం వీరుడు అల్లూరి గాథ" శీర్షికన  రాసిన పరిశోధనాత్మక  గ్రంథంలో, దృశ్యమానంగా ప్రస్తావించారు. 

ఈ గ్రంథం నవంబర్ 2017లో ప్రచురితం.   

ఆ గ్రంథంలోని ఉటంకింపు ఇలాసాగింది. 

---

" ... మరునాడు పెద్దాపురంలో దిగారు. తెలతెలవారుతుండగా. 

పెద్దగా కష్టపడకుండానే అతడి (Shaik  Madina ) చిరునామా తెలిసింది. పేరు షేక్ మదీనా. ఊరు మొదట్లోనే చిన్న పెంకుటిల్లు. రిటైర్డ్ పొలీసు ఉద్యోగి  మదీనా. అరవై అయిదేల్లుంటాయి. 

వాళ్లలో రేగరాజు మహా చురుకు. మాటకారి. 

'నవాబుగారూ ! నమస్కారం. మాది తుని. క్షత్రియులం.' అన్నాడు. 


'నమస్కారం బాబూ !' అన్నాడతడు ఎంతో మృదువుగా

 'తుపాకీ కాల్చడంలో తమది అందే వేసిన చేయి అని విని వచ్చాం. ఇంతదూరం.  మా శ్రీరామరాజూకి వేటాడాలని కోరిక. మీరు తుపాకీ పట్టడం నేర్పించాలి. కాదనకూడదు.' అన్నాడు రేగరాజు

'ఎంతమాట బాబూ ! నేర్పిస్తాను. ఓ మూడు రోజులు ఉంటారా ? ఇంతకీ ఎక్కడుంటున్నారు?' అన్నాడు మదీనా 

'ఉంటాం. సత్రంలో బస'. మళ్ళీ అన్నాడు రేగరాజు

'అదిగో చూసారుగా. ఆ కొండ. ఆ గుడి. అదే  పాండవుల మెట్ట. మధ్యాహ్నం మూడు గంటలకి  వచ్చేయండి. నా తుపాకీ ఉంది. దానికి లైసెన్స్ కూడా ఉంది.  నేర్పించేద్దాం!', అన్నాడు మదీనా 

'ఇప్పుడైతే ఏం ?' అమాయకంగా  అడిగాడు పేకేటి సుబ్బరాజు.

 'లేడికి లేచిందే ప్రయాణం అంటే కాదు బాబూ!  ఈ ఊళ్ళోనే సారస్వత సంఘం అని ఉంది. దాన్లో పనిచేస్తున్నాను. మధ్యాహ్నం ఖాళీ.  పైగా ఆ వేళకి మెట్ట మీద ఎవరూ ఉండరు' అన్నాడు మదీనా .

సాయంత్రానికి నెమ్మదిగా వచ్చాడు మదీనా. రెండు భుజాల మీద రెండు రైఫిళ్లతో. 

అంత మృదుస్వభావిగా కనిపించిన మదీనా, శిక్షకుడిగా మారాక యుద్ధం చేయిస్తున్న సేనానిని మరిపించాడు. చిన్న తప్పిదం చేసినా కొట్టినంత పనిచేశాడు. కానీ రెండు రోజుల్లోనే గన్ లోడ్ చేయడం, గురి పెట్టడం, పేల్చడం నేర్పేశాడు..."

(పుటలు  53, 54)

=== 

బ్రిటిష్ ప్రభుత్వాన్ని, ఆంగ్లేయ అధికారులను గడగడ లాడించిన మన్య విప్లవ సారథి, వీరయోధులు, అమరజీవి శ్రీ అల్లూరి సీతారామరాజు ఉద్యమ / పోరాట జీవితంలో అతి ముఖ్యమైన పాత్ర నిర్వహించిన షేక్ మదీనా గురించి, అయన అల్లూరికి తుపాకి కాల్చడంలో ఇచ్చిన శిక్షణ గురించిన కనీస ప్రస్తావనలు, ప్రచారం ఏమాత్రం లేకపోవటం విచారకరం.


నిష్కళంక స్వాతంత్ర్యసమరయోధుడు శ్రీ అల్లూరి సీతారామరాజు


.

శ్రీ అల్లూరి సీతారామరాజు భూకబ్జాదారుడని, యాభై ఎకరాల భూమికొరకు అతను బ్రిటిష్ వారితో పోరాడాడని, దాన్ని కొద్దిమంది  స్వాతంత్ర్యపోరాటంగా చిత్రీకరించారంటూ ఒక పోస్టు ఇటీవల వాట్సప్ గ్రూపులలో వైరల్ గా సంచరిస్తోంది. 


శ్రీ అల్లూరి సీతారామరాజు జీవించి ఉండగా అతను జరిపిన పోరాటం పై వచ్చిన వార్తా కథనాలు, ఒక ఔత్సాహిక విలేఖరికి ఇచ్చిన అతని ఇంటర్వ్యూ ద్వారా – శ్రీ రామరాజు నిజాయితీగా, స్వాతంత్రపోరాటం జరిపినట్లు అర్ధమౌతుంది.  శ్రీ రామరాజు మరణించిన వెంటనే వచ్చిన కొన్ని వ్యాసాలలోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమవటం కూడా శ్రీ రామరాజు నిష్కళంకతను రుజువుచేస్తుంది.  


ఈ అంశానికి సంబంధించి ఆనాటి పత్రికా కథనాలు…. వాటి విశ్లేషణా


.

1. April 21, 1923 ఆంధ్రపత్రిక

.

శ్రీ అల్లూరి సీతారామరాజుతో శ్రీ చెరుకూరి నరసింహమూర్తి జరిపిన సంభాషణ  April 21, 1923 ఆంధ్రపత్రిక లో ప్రచురింపబడింది. శ్రీ మూర్తిగారు అప్పటికే దేశంలో ప్రబలంగా నడుస్తున్న సహాయ నిరాకరణోద్యమంలో చురుకుగా పాల్గొంటున్నారు.  

 

శ్రీ అల్లూరి సీతారామరాజు 17 వ తారీఖు ఉదయం 6:30 కు అన్నవరం పోలీసు స్టేషనును ముట్టడించి, అక్కడి పోలీసు తుపాకులను స్వాధీనం చేసుకొని, అన్నవర సత్యనారాయణస్వామి దేవాలయ సత్రంలో స్నానపానాదులు కావించి; కాసేపు జపం చేసుకొని పది గంటల సమయంలో శంకవరం గ్రామం వైపు వెళిపోయారు. ఆ రోజు  మూర్తిగారు రాజు గారితో  జరిపిన సంభాషణ ఇలా ఉంది. 


మూర్తి:  మీ రే సంకల్పముతో నీ పితూరిని నడుపుతున్నారు 

రాజు:   ప్రజలకు స్వాతంత్ర్యము లభించుటకే

.

మూర్తి:  ఏ సాధనము వలన

రాజు:  దైర్జన్యము వలననే.  యుద్ధము చేసినగాని మనకు స్వరాజ్యము రాదు

.

మూర్తి: స్వాతంత్ర్యము బడయగలుగుదునను నమ్మకము మీకు కలదా?

రాజు:  రెండేండ్లలో స్వరాజ్యము తప్పక లభించునను నమ్మకము నాకు కలదు.

.

మూర్తి: రెండేండ్లలో స్వరాజ్యమెట్లు లభించును? మీ రవలంబించుచున్న పద్దతివలననే స్వరాజ్యము వచ్చునా?

రాజు: వచ్చును. తప్పక వచ్చును.  నాకు అనుచరుల సంఖ్య అత్యధికముగానున్నది.  జనము లోటేమియును లేదుగాని తుపాకులును మందుగుండ్లును కావలెను.  వానికొరకె సంచారము చేయుచున్నాను.  

.

మూర్తి: దౌర్జన్యముతో కూడిన యుద్ధములవలనను జన నష్టమువలనను ప్రపంచము విసుగు చెందియున్నది.  దౌర్జన్యముకూడదను సిద్ధాంతమునే యిపుడు ప్రపంచములోని అన్నిదేశముల వారును ఆదరించుచున్నారు.  జర్మనీవారుగూడా సాత్విక నిరోధమునే ప్రారంభించిరి.  గాంధి మహాత్ముడు బోధించిన దౌర్జన్యరాహిత్య శాంతి సాధనములందుమాత్రమే మాకు నమ్మకముకలదు.  సకలప్రపంచమునకు శాంతిమార్గమును బోధించుటకు దేవదూత గాంధిమహాత్ముని రూపమున వచ్చెనని ప్రపంచమువారందరును నమ్ముచున్నారు.

రాజు: నాకు దౌర్జన్యరాహిత్యమునందు నమ్మకము లేదు.  దౌర్జన్యమువలననే స్వరాజ్యమును బడయగలుగుదుమని నేను గట్టిగా నమ్ముచున్నాను.

***


పై వార్తా కథనంలో వర్ణించిన రాజుగారి ఆకృతి: వయసు 26 ఏండ్లు, ఎత్తు 5 అడుగుల 4 అంగుళాలు; బక్కపలచన, ఆరోగ్యముతో, అందమైన దేహం; ఎప్పుడు నవ్వుమొఖముతో, వినయసంపదకలిగి, మర్యాదతో వ్యవహరిస్తారు; యోగులవలె గెడ్డము, తలవెంట్రుకలను కలిగి ఉన్నారు.  ఖద్దరు ఖాకి పొట్టి నిక్కరు, ఖద్దరు చొక్కాను ధరించారు. చేతిలో పేనుబెత్తము కలదు.  కాలికి చెప్పులు లేవు.

***

పై ఇంటర్వ్యూ లో శ్రీ అల్లూరి సీతారామరాజు తన ఉద్యమ లక్ష్యం స్వాతంత్ర్యాన్ని సాధించటమే అని నిర్ద్వంద్వంగా పేర్కొన్నాడు. హింసా పద్దతుల ద్వారా స్వాతంత్ర్యాన్ని సాధించాలి అని నమ్మిన సుభాష్ చంద్రబోస్ కంటే ముందే ఆ లక్ష్యాన్ని  స్వప్నించటం గమనార్హం. 

***


2. ఆంధ్రపత్రిక 1922 అక్టోబరు 18 


రంపపితూరి మూలకారకుని వృత్తాంతము


నరసిపట్నం దగ్గరనున్న గూడెం కొండలలోనుండి బయలుదేరిన యేజన్సీ పితూరి (పితూరి-తిరుగుబాటు) విషయము ఇటీవల తెలియవచ్చు సంగతుల వలన తీవ్రముగా నున్నట్లు కనుపట్టుచున్నది.  మూడువందలవరకును పోలీసుదళము పితూరిదారులను పట్టుకొనవలెనని ప్రయత్నించుచున్నది.  ఇంతవరకు నిరువురు తెల్ల ఉద్యోగీయులు హతులైరి.  పోలీసులు కాన్సటబిల్సు కూడా కొంతమంది చంపబడిరి.  కొందరకు గాయములు తగిలెను.  మలబారు విప్లవ సందర్భములో ననుభవముగల యే ఆర్. న్యాపుగారు కూడా స్వయముగా వచ్చి పితూరి ప్రాంతములను పరీక్షించి పోయిరి.  పరిస్థితులు తీవ్రముగా నున్నట్లు ఇంతవరకు ప్రభుత్వముపయోగించిన బలము నిష్ప్రయోజనమగుట రుజువు చేయుచున్నది.  


ఈ పితూరిని నడుపుచున్నది అల్లూరి సీతారామరాజను క్షత్రియ యువకుడని ప్రచురింపబడినది.  ఆయన అద్భుతశక్తులు కలవాడని ప్రజలు చెప్పుకొందురు. 


//ఈయనకు 25 సంవత్సరముల వయస్సుండును.  ఆజాన బాహువు, విశాల వక్షస్కుడు, బలిష్ఠుడు, స్ఫురద్రూపి, పచ్చని దేహచ్ఛాయకలవాడు. నల్లనిగడ్డము పెంచెను. కాషాయవస్త్రములను ధరించి స్వరూపముచే నాకర్షించు బాలసన్యాసి.  జ్యోతిషము, సాముద్రికము, వైద్యము తెలిసినవాడు. ప్రశ్నచెప్పగలడు.  ఒక్కమారతనితో మాట్లాడువారు అతని వశులగుదురు.  వైద్యముకొరకును, ప్రశ్నలను తెలుసుకొనుటకును, కొండవారనేకమందితని యొద్దకు వత్తురట. వారి ప్రశ్నలకు సరియైన నిదర్శనములు కనుపడుటచేతను కొండవాండ్రకాయన భగవంతుండను మూఢభక్తి గలదు.


//ఇతను వీలగునంతవరకును ప్రజలకు సేవజేయుచు వారి విశ్వాసమునకు పాత్రుడయ్యెను.  ఎవరికే కష్ట్మౌలు గలిగినను సహానుభూతి చూపుచు తనకు వీలైన సహాయము చేయువాడట.  మందస్మిత వదనముతో పలుకు యీతని పలుకులు జనులనాకర్షించి అతని ప్రేమింపజేయును.  అతనికా చుట్టుపట్లనున్న గ్రామములలో చాల గౌరవము కలదు.  కృష్ణాదేవి పేట చుట్టుపట్లనున్న అయిదారు గ్రామములలో నీయన పంచాయితీ కోర్టులను స్థాపించి ప్రజలలో న్యాయమును నెలకొల్పెను.  ఏజెన్సీ యుద్యోగులా పంచాయతులను బ్రద్దలుగొట్టిరి.  ఈ సందర్భమునని రాజుగారు నిరాకరణవాది యను నెపమున వానిని ఆరువారములు కైదులో ఉంచి,  దోషిగ నెంచుటకు దగిన ఆధారములు లేక వదిలివేసిరి. 

.

పై వార్తా కథనముద్వారా శ్రీ అల్లూరి సీతారామరాజు వ్యక్తిత్వం అర్ధమౌతుంది. 

***


3. ఆంధ్రపత్రిక 1922, అక్టోబరు 4


ఇద్దరు పోలీసు ఉద్యోగులును, 28 మంది పోలీసులును గుడెం కొండలలో పితూరిదారుల కొరకు వెతుకుచుండగా సెప్టెంబరు 24 వ తేదీన పితూరిదారులదరిపాటున వారిపై బడిరి.  ఉద్యోగులగు స్కాటు కవర్డు, హయిటరు గార్లును ఒక కనిస్టెబును యీ ముగ్గురును మడసిరి (చనిపోయారు).  ఒక హెడుకనిస్టేబుకును, ఇంకొక కనిస్టేబుకును గాయములు తగిలెను.  మరియొక కనిస్టేబు కనబడనేలేదు.// ఉద్యోగుల మరణవార్త హతశేషులవలన విని వారి శవములను కొనితెచ్చుటకు కొండపైకేగుటకు ఆర్మిటేజి గారు ప్రయత్నింపగా అడవిలోనున్న పితూరిదారులు తుపాకులను కాల్చుటచే ఆర్మిటేజిగారు ముందుకు వెళ్లలేదు.  ఈ రెండవప్రయత్నమున మరలనొక కనిస్టేబు హతుడయ్యెను. చనిపోయినవారి శవములను, గాయములు తగిలినవారిని పిమ్మట గ్రామవాసులు తీసుకొని వచ్చిరి.


స్కాటుకవర్డు గారికి మన్యమంతయును బాగుగా తెలియును.  ఆయన చాలా సమర్ధుడు.  హయిటరు గారు టెంపరరీ పోలీసు అసిస్టెంట్ సూపర్నెంటు. జర్మని యుద్ధములో, 1914 ఏడెనులో,  1919  ఆఫ్ఘను యుద్ధములో పనిచేసెను.  ఈ యుద్యోగులిద్దరును హతులగుటవలన గొప్పనష్టముకలిగినది.  


పితూరి దారుల నాయకుడగు అల్లూరి సీతారామరాజును అతని ముఖ్యానుచరులనిద్దరిని గూర్చి తెలిపినవారికిని వారిని పట్టియిచ్చిన వారికిని బహుమానము లియ్యబడునని ప్రకటింపబడెను.  మన్యములో ముఠాదారులు (కౌలుదారులు) ఇట్టి తొందరలు కలిగినపుడు పోలీసులకు సహాయము చేయవలెనను షరతుకలదు గాన అట్లు సహాయము చేయవలెనని ముఠాదారులను నిర్భంధించుటకు ఏర్పాటులు చేయబడెను. 

.

పై సంఘటన ద్వారా శ్రీరామరాజు ఉద్యమం ఏ మేరకు బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించాడో తెలుస్తుంది. 

***


4. ఆంధ్రపత్రిక 1923, మే 31 జూన్ 4, జూన్ 19


1922 అక్టోబరు నెలలో జరిగిన ఎదురుకాల్పులపై విశాఖపట్నం కోర్టులో జరిగిన విచారణ వివరాలు 1923, మే 31, జూన్ 4, జూన్ 19 వ తేదీల ఆంధ్రపత్రిక లో విపులంగా వచ్చాయి. ఈ విచారణలో దుశ్చర్తి గ్రామ కౌలుదారుడైన చొక్కలింగం దొర ఇచ్చిన సాక్ష్యంద్వారా శ్రీ రామరాజు భూకబ్జాదారుడని చేసిన ఆరోపణ పూర్తిగా సత్యదూరమని అర్ధమౌతుంది. 


శ్రీ రామరాజుకి  అసిస్టెంటు కమిషనరు గారు పైడిపుట్టలో 50 ఎకరముల భూమి ఇచ్చినట్లు; సదరు ఆర్డరు ప్రకారం ఈ చొక్కలింగం ఆ భూమిని శ్రీరామరాజుకు అప్పగించినట్లు; ఆయన ఆ భూమిని దున్నటము మొదలగునవి ఏమీ చేయక, వారు (రామరాజు) నేపాళదేశము వెళ్ళిపోతానని చెప్పేవారని చొక్కలింగం సాక్ష్యం చెప్పాడు.  

***

ఇదే విచారణలో అడపా నడిపిపడాలు అనే సాక్షి “బాస్టియన్ దొర (ఏజెన్సీ డి. తహసిల్ దారు) పెట్టు బాధలచేతనే యీ పితూరి లేచినదని ప్రజలు తరుచుగా అనుకొంటారు” అని చెప్పాడు.  అదే విధంగా క్రాస్ ఎగ్జామినేషను చేస్తున్న వకీలు “బేస్టియన్ దొరగారి మహా ఉద్రేకమయిన అల్లరులే ఈ పితూరీకి కారణము.  ఆయనను తీసివేస్తే ఈ పితూరీ లేకపోవును” అని వ్యాఖ్యానించాడు. 


బాస్టియన్ దొర దురాగతాలను గురించి ఖానుబహద్దరు అబ్దులు హజీజు సాహెబు (పోలవరం కలక్టరు) కూడా తన సాక్ష్యంలో ఇలా చెప్పాడు. “ బాస్టిన్ దొరగారిని నేను ఎరుగుదును. బాస్టిన్ గారు ప్రజలను బాధపెట్టెదరు.  ప్రజలచే 500 రూపాయీలు పనిచేయించుకొని పని బాగాచేయలేదను అబద్దపు మిషపై 100 రూపాయిలు మాత్రమే కూలీలకిచ్చేవారు. // కూలీలను తీసుకురాని ముఠాదారులకు మిరపకాయగుండను వారి మర్మస్థలములో బాస్టన్ గారు రాయించేవారు.  ఇటులనే అనేక బాధలు పెట్టేవారు.  నేను బాస్టిన్ గారి చర్యలను గూర్చి ఒక గట్టి రిపోర్టును వ్రాయగా బాస్టిన్ గారిని ఇప్పుడు పొట్టంగికి బదిలీ చేసినారు. సంతానం పిళ్ళై అను ఓవరుసీయరు గూడ ప్రజలను బాధపెట్టుటలో బాస్టను గారికి చాలా తోడుపడెను.  ఈయనను ఈ తరువాత బర్తరవు చేసిరి//.   

మన్యంలో బాస్టిన్ దొర అతని అనుచరులు చేసిన విధ్వంసం వలన తిరుగుబాటు వచ్చింది, అనేవాదన శ్రీరామరాజు ఉద్యమానికి ఉన్న విశాల ప్రయోజనాలను పరిమితం చేస్తుంది.  బహుశా ఆ దురాగతాలు రామరాజును తక్షణం ప్రేరేపించిన అంశాలుగా భావించవచ్చు.  


***

ఈ విచారణలో అగ్గిదొర అనే ఒక సాక్షిని ప్లీడరు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తూ “రెండు సంవత్సరములలో బ్రిటిషు గవర్నమెంటు యుండదని రాజుగారు చెప్పుచుండెడివారని మీకు తెలియునా? అని ప్రశ్నించగా అతను “అట్లు రాజుగారు చెప్పుచున్నట్లు వదంతి గలదు” అని చెప్పటాన్ని బట్టి శ్రీ అల్లూరి సీతారామరాజు పోరాటం అంతా బ్రిటిషు గవర్నమెంటుకు వ్యతిరేకంగాచేసిన స్వాతంత్రపోరాటంగా విశ్వసించవచ్చును. 

***


ముంజేరి కౌలుదారుడైన శరభం నాయుడు తన సాక్ష్యంలో – పితూరిదారులు సెప్టెంబరు నెలలో మా వూరు వచ్చారు.  వారి చేతులలో తుపాకులు కత్తులు వగైరాలు కలవు.  సర్కారుపై పోట్లాటకు కుమ్ముకు రావలెనని రాజుగారు మమ్ములనడుగగా మేము రామన్నాము.  “దెబ్బలాట జరుగును గనుక మీ గ్రామములో ఎవరిని ఉంచకండి దెబ్బలు తగులుతవి అని నాతో రాజుగారు చెప్పగా భయముతో నేనుపోయి మావాళ్ళనందరిని మా వూళ్ళోనుంచి పంపివేస్తిని.  

పై ఉదంతం ద్వారా శ్రీ రామరాజు బ్రిటిష్ ప్రభుత్వంతో చేస్తున్న పోరాటంలో, తనకు సహకరించని వ్యక్తులకు కూడా ఏ నష్టం జరగకూడదని కోరుకొనేవాడని అర్ధమౌతుంది.   ఇది ఆయన ఉదాత్త వ్యక్తిత్వంగా భావించాలి. 

***


***

5. శ్రీ రామరాజు గురించి స్వైరు దొర ఒక  రిపోర్టు ప్రభుత్వానికి సమర్పించాడు.  అది ఇలా ఉంది.


“నేను అల్లూరి శ్రీ రామరాజుగారిని పిలిపించి మాటలాడితిని.  అతని వయసు 25 ఏండ్లు-ఆయన విద్యాధికుడు.  ఆంగ్లమున చాలా బాగుగా మాటలాడగలడు.  ఆయన తనచరిత్ర నిటుల తెలిపెను.  కృష్ణాజిల్లా మోగల్లు గ్రామమున నేను జననమై 14 వ ఏడు వచ్చువరకు నచటనేయుండి పిమ్మట కొంతకాలము రాజమంద్రిలోను తరువాత రామచంద్రపురమున, జాతీయపాఠశాలలోను విద్యనభ్యసించితిని.  విరాగినై యరణ్యవాసముచేసి తరువాత సన్యసించునుద్దేశముతో నాలుగేండ్లక్రితమీ మన్యప్రాంతమునకు వచ్చితిని” అని రాజుగారు నాతో చెప్పిరి.  అది మొదలుగా నరశీపట్నము మున్నగుచోట్లకు వెళ్ళుచున్నను తరుచు మన్యములోనే కొండలలోను అడవులలోను ఆయన తిరుగుచుండెను-ప్రజలలో చిన్న చిన్న సివిలు దావాలను పరిష్కరించుటకు ఆరునెలలక్రితము పంచాయితీ కోర్టులనేర్పరచెను.  


// “నాకు దివ్యశక్తులు కలవని అవివేకముచే ప్రజలు తలంచు చున్నారు- నేను పితూరి ప్రారంభించెదనను వదంతులు బయలుదేరినవి-నాకు అసహాయోద్యమముతో సంబంధమేమియును లేదు” అని రాజుగారే నాతో చెప్పిరి.  మీరు మన్యమును వదిలి నరిశీపట్నం వెళ్లవలెనని నేను తెలుపగా వెంటనే ఆయన అంగీకరించెను-అసిస్టెంటు కమీషనరు 31 వ తేదీని నరిశీపట్నమునకు రాగా ఆయన యెదుట రాజుగారు వ్రాతమూలమున గూడనిచ్చెను-ఇపుడితడు ప్రభుత్వమునకు వ్యతిరేకముగా నేమియును చేయదలచినట్లగుపడలేదు గాన ఇతనిపై చర్యజరుపుటనవసరము- అని ఆ రిపోర్టులో నున్నది.  

.

1922 లో శ్రీరామరాజును అరస్టుచేసి, ఆరువారాలపాటు బంధీగా ఉంచి,  రాజద్రోహం చేసినట్లు ఏ రకమైన ఆధారాలు లభించక విడిచిపెట్టినప్పుడు విచారణాధికారిగా స్వైరు దొరగారు రాసిన రిపోర్టు అది. 


ఈ సందర్భంగా ఈ పోలీసు చెరనుండి నన్ను విడిపించమని శ్రీ రామరాజు పోలవరం డివిజను కలక్టరైన ఫజులా సాహెబు గారికి అర్జీ పెట్టగా, ఆయన రాజుకు ముప్పది యకరాల భూమిఇప్పించి పైడిపుట్టి గ్రామములో ఉండి వ్యవసాయము చేసుకొని జీవించమని ఆజ్ఞాపించాడు.  దుశ్చర్తి కౌలుదారుడైన చొక్కలింగం కు ఆ మేరకు ఉత్తర్వులు జారీచేసాడు.   (రి. శ్రీ రామరాజు ప్రశంస - మద్దూరి అన్నపూర్ణయ్య  ఆంధ్రభారతి జూలై, 1928


ఆ నేపథ్యంలో బహుసా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమీ చేయను అని కాగితాలపై సంతకాలు పెట్టించుకొని ఉంటారు. కానీ శ్రీ అల్లూరి సీతారామరాజు లక్ష్యం, గమ్యం వేరే ఉన్నప్పుడు ఆ సంకల్పాన్ని సంతకాలు నిలువరించగలవా? 

ఆ తదనంతరం ఆ భూమినాకు అవసరం లేదు అంటూ, మీ ఇష్టం వచ్చినవారికి ఇచ్చుకోవచ్చును అంటూ 14-06-1922 న ఒక ఉత్తరం ద్వారా శ్రీ రామరాజు చొక్కలింగంకు తెలియచేసాడు.  ఈ సంఘటన ద్వారా కూడా శ్రీ రామరాజు తృణప్రాయమైన సంపదలకొరకు   తన వ్యక్తిత్వాన్ని, లక్ష్యాన్ని అమ్ముకొనే వ్యక్తి కాదని నిరూపితమౌతుంది.   

***

6. శ్రీ రామరాజు ప్రశంస - మద్దూరి అన్నపూర్ణయ్య  ఆంధ్రభారతి జూలై, 1928


స్వరాజ్యమే అతని లక్ష్యము

…. కానీ అది పితూరీ కాదు.  అది స్వాతంత్ర్య యుద్ధము.  బాష్టియను దుండగములు భూముల రిజర్వేషను వలన ప్రభుత్వముపై కోయదొరలలో జనించిన ద్వేషమును శ్రీ రామరాజు ఊతగాగొని స్వరాజ్యము లభించినగాని శాశ్వతసౌఖ్యము జేకూరదని అతడు నిష్కర్షగా బోధించియుండవలెను. 


//స్వరాజ్యమే తన పరమావధియైనటుల తనకు కుడిభుజములైన గాం సోదరులతో స్పష్టముగా చెప్పినట్లు ఒక పితూరీదారుడు కోర్టులో చెప్పెను.  సిఐడి సబినస్పెక్టరు గుండాల శ్రీనివాసరావు గారు కూడా కోర్టులో స్వరాజ్యముకొరకే యుద్ధముజేస్తున్నానని రాజు తనతో చెప్పినట్లు తెలిపినాడు. కాన ముమ్మాటికిని ఆయన వుద్దేశం స్వరాజ్యస్థాపనమే అని రూఢియగుచున్నది. 


***


7. శ్రీ అల్లూరి రామరాజు గారు -  భోగరాజు పట్టాభిసీతారామయ్య, భారతి 1-7-1928


//శ్రీ రామరాజుగారు దోపిడి చేయలేదు. పితూరిగావింపలేదు.  స్వార్ధముకొరకు ఘోరకృత్యములు సలుపలేదు.  తన దేశవిముక్తికొరకు బ్రిటిషువారిపై యుద్ధము చేసెను.  ఆనాడు నానాఫర్నవీసు, రాణీలక్ష్మీభాయి మున్నగువారు భారత స్వాతంత్ర్య యుద్ధముకొరకు యెటుల పోరాడిరో అటులనే 3 సంవత్సరములకాలము, బ్రిటిషు ప్రభుత్వోద్యోగులకు పూర్వసూచనలు గావించి, బహిరంగ యుద్ధములకై స్థల కాలనిర్ణయములతో నాహ్వానములనంపుచు, యుద్ధమును జరిపెను.

.

8. ముగింపు


శ్రీ రామరాజును బ్రిటిష్ వారితో సహా ఆయన సమకాలీనులు సరిగానే అర్ధం చేసుకొన్నప్పటికీ నేడు కొందరు ఆయన భూకబ్జా దారుడని, సొంత భూమికోసం బ్రిటిష్ వారితో చేసిన పోరాటాన్ని స్వాతంత్ర్యపోరాటంగా చిత్రీకరిస్తున్నారంటూ దుర్మార్గమైన కట్టుకథలను ప్రచారం చేస్తూ చరిత్రను వక్రీకరించబూనటం గర్హనీయం. 


కొన్ని వార్తాకథనాలలో చెప్పినట్లు కేవలం ఎనిమిది వందలమంది అనుచరులతో, అరకొర ఆయుధసంపత్తితో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించబూనటాన్ని అవగాహనా రాహిత్యంగా కాక మాతృదేశ దాస్యశృంఖలాలను విడిపించాలన్న తీవ్రమైన జ్వలించే కాంక్షగానే చూడాలి.  ప్రాక్టికల్ గా ఆలోచించే నేటి తరానికి అలా పోరాడటం వెనుక నిప్పులాంటి నిష్కల్మషమైన చిత్తశుద్ధి,  నిజాయితీ ఉండేవనే విషయం నమ్మబుద్ధికాక ఏవో స్వార్ధప్రయోజనాలు ఉండే ఉంటాయని సరిపెట్టుకోచూడటం, ఆ మేరకు వక్ర భాష్యాలు చెప్పటం నేటికాలపు విషాదం.  


శ్రీ రామరాజు ఉదంతంలో భిన్న వ్యవస్థలు కలవరపడిన వైనం ఆనాటి వార్తాకథనాలద్వారా స్పష్టంగా అర్ధమౌతుంది


కాంగ్రెస్ పార్టీ అప్పటికి సహాయనిరాకరణోద్యమం పేరిట మెత్తమెత్తగా స్వాతంత్ర్యపోరాటం జరుపుతోంది.  శ్రీ రామరాజు  మన్యంలో జరుపుతున్న ఈ సాయుధ పోరాటం అనేది తమపీకకు ఎక్కడ చుట్టుకొంటుందో అని- మన్యం అనేది దుర్గమమైన కీకారణ్యం.  అక్కడకు కాంగ్రెస్ నాయకులు వెళ్ళి ఆ ప్రజలను ప్రభావితం చేసి పితూరీ లేవదీసే అవకాసమే లేదు అని ప్రకటించి చేతులు దులుపుకొంది.


బ్రిటిష్ ప్రభుత్వం ఈ పితూరి బ్రిటిష్ ప్రభుత్వంపై కాదని, ఏదో స్థానిక బాస్టిన్, సంతానం వంటి స్థానిక అధికారుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా రేగిన చెదురుమదురు అల్లర్లని ప్రకటించుకోవటానికి ఆరాటపడింది. 


అంతే కాక పితూరీదారులు ఊర్లను దోచుకొన్నారని వైజాగ్ లో జరిగిన కోర్టు విచారణలో పదే పదే సాక్షులతో చెప్పించినప్పటికీ, చాలామంది సాక్షులు పితూరి దారులు బియ్యం, వంట సామాగ్రి, పడుకోవటానికి మంచాలు ఎత్తుకుపోయారని చెప్పారు తప్ప ధనకనక వస్తువులు దోచుకొన్నట్లు ఎవరూ చెప్పలేదు.  అంతే కాక స్త్రీలను చెరిచిన దాఖలాలు కూడా కానరావు.  ఇది శ్రీ రామరాజు నాయకత్వ పటిమగా అర్ధం చేసుకోవాలి.

 

శ్రీ రామరాజుకు 50 ఎకరాలు భూమి ఆశచూపి ఉద్యమాన్ని నీరుకార్చాలని చూడటం కూడా ఆనాటి ప్రభుత్వం చేసిన ఒక ప్రయత్నం.  


ఇక అన్ని ప్రయత్నాలు విఫలమై, ఈ ఉద్యమం దావానలమై ప్రజలలో విస్తరిస్తున్నదన్న సంగతి గ్రహించిన ప్రభుత్వం, చివరకు ఎన్కౌంటర్ రూపంలో శ్రీరామరాజును మట్టుబెట్టటం జరిగింది. తనను ప్రశ్నించేవారిపై రాజ్యం చేసే చివరి దరహాసమని అనాదిగా పదే పదే రుజువయ్యే పరమ సత్యమది. 


బొల్లోజు బాబా

9/7/2022







అల్లూరి చరిత్రలో వాస్తవాలు:

------------------------------  బర్ల వెంకటరావు


అల్లూరి చరిత్రలో కట్టుకథలు (మే 6, ఆంధ్రజ్యోతి) అనే శీర్షిక పడాల వీరభద్రరావు (రాష్ట్ర అల్లూరి సీతారామరాజు యువజన సంఘం, అల్లూరి సీతారామరాజు చరిత్ర పరిశోధకులు) రాసిన వ్యాసం చదివాను. ఆ తర్వాత నాకు కూడా అల్లూరి సీతారామరాజు గురించి నేను విన్నవి, చదివినవి రాయాలని అనిపించింది.చిన్నతనంలోను, వయసులో ఉన్నప్పుడు, ప్రతి తెలుగువాడిలాగా నేనూ అల్లూరి సీతారామరాజు గురించి తెలుసుకోవాలనే కుతూహలంతో ఆయన మీద వచ్చిన ప్రతి పుస్తకం చదివాను.నేను సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీసుగా, 1985లో తూర్పుగోదావరి జిల్లా, అడ్డతీగల ప్రాంతంలో గల తిరుమలవాడ ఏఓపీ (ఆర్మ్‌డ్ అవుట్ పోస్ట్) కేంప్ ఇంచార్జ్‌గా ఉన్నాను.

అప్పుడు అల్లూరి సీతారామారాజు మీద ఆయన బంధువే రాసిన పుస్తకం చదవడం జరిగింది. ఆ పుస్తకంలో విషయం నాకు గుర్తున్నంత వరకు-అల్లూరి సీతారామరాజు తన తండ్రి మరణానంతరం, తన తల్లితో, సోదరునితో తుని వచ్చి, తుని తాహసిల్దార్‌గా పనిచేస్తున్న తన పినతండ్రి ఆశ్రయం పొందాడు. తర్వాత సీతారామరాజు (నిజానికి శ్రీరామరాజు, సౌలభ్యం కోసం సీతారామరాజు) పినతండ్రి సలహాపై పైడిపుట్ట గ్రామం చేరి, అక్కడ ఒక అరవై ఎకరాల ప్రభుత్వ అటవీ భూమిని, వ్యవసాయం చేయడానికి అనువుగా తయారు చేయడానికి అందులో ఉన్న చెట్టు చేమలను నరికి పారేసి, ఆ భూమిని ఆక్రమించి అందులో ఓ ఆశ్రమం నిర్మించాడు.


దానికి 'శ్రీరామ విజయనగరం' అని పేరు పెట్టాడు. ఆ తర్వాత తాను వ్యవసాయానికి అనుగుణఃగా మార్చుకొన్న సదరు భూమి అరవై ఎకరాలను, తన పేరున పట్టా ఇప్పించాలని అప్పటి జిల్లా కలెక్టర్ రూథర్ ఫర్డ్ దొరకి అల్లూరి సీతారామరాజు స్వహస్తాలతో అర్జీ పెట్టుకున్నాడు. ( ఆ అర్జీ ఫోటో ప్రింటు ఆ పుస్తకంలో ముద్రించడమైంది. ఆ అర్జీ ఇప్పటికీ తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో పదిలంగా ఉంది అని రచయిత ఆ పుస్తకంలో చెప్పడం జరిగింది). ఎప్పుడో పాతికేళ్ళ నాడు చదివిన పుస్తకంలో అర్జీ యథాతథంగా అనలేను గాని, భాష, భావం, ఈ క్రింది విధంగా,,, శ్రీరామ -విజయనగరం, తారీఖు...., మహా ఘనత వహించిన జిల్లా కలెక్టర్ శ్రీశ్రీశ్రీ రూథర్ ఫర్డ్ దొరవారి దివ్య సముఖమునకు, తమకు అత్యంత విశ్వాసపాత్రుడు అయిన అల్లూరి శ్రీరామరాజు వ్రాసుకొను అర్జీ విన్నపములు..


అయ్యా!

నేను పైడిపుట్ట గ్రామంలో గల అరవై ఎకరాల ప్రభుత్వ అటవీ భూమిని వ్యవసాయానికి అనుకూలంగా చెట్టూ చేమలు తొలగించి, మార్చుకొని, ఒక ఆశ్రమం నిర్మించుకొని, ఈ ప్రాంతానికి శ్రీరామ విజయ నగరం అని పేరు పెట్టుకొని, ఇక్కడ నివసిస్తున్నాను. తమరు నాయందు దయ ఉంచి పెద్దమనసుతో ఈ భూమి నా పేరున పట్టా ఇప్పించినచో, తమ పేరు చెప్పుకొని, వ్యవసాయం చేసుకొంటూ జీవింగలవాడను.....ఇట్లు-తమకు మిక్కిలి విధేయుడు-అల్లూరి శ్రీరామరాజు.


దాంతో అనుమతి లేకుండా ప్రభుత్వ భూమిని ఆక్రమించి, నాశనం చేసినందుకుగాను (చెట్టు చేమలు తొలగించడం) సీతారామరాజు మీద పోలీసు కేసు పెట్టింది ప్రభుత్వం. ఆ కేసు వాయిదాలకు నర్సీపట్నం కోర్టుకి సీతారామరాజుకి హాజరు అయ్యే నేపథ్యంలో, అతనికి అక్కడ గాము సోదరులతో (గాము గంటన్న దొర, గాము మల్లు దొర) పరిచయం ఏర్పడింది. 1992లో నేను రాజవొమ్మంగి సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసినప్పుడు చదివిన స్టేషన్ హౌజ్ రొటీన్ పార్ట్ 4 ప్రకారం, గాము సోదరులకి, వారి దాయాదులకి మధ్య గల భూమి తగాదాల్లో కోర్టు చుట్టూ తిరిగేవారు.


సక్రమంగా కోర్టుకి హాజరు కాకపోవడంతో, కోర్టువారు, సీతారామరాజు, గాము సోదరుల మీద నాన్ బెయిలబుల్ వారంట్ల జారీ చేయడం జరిగింది. వారంట్లు ఎగ్జిక్యూట్ చేయడానికి పోలీసులు ప్రయత్నించిన సందర్భంలో సీతారామరాజు అనుచరుడు విడిచిన బాణానికి ఓ పోలీసు బలి అయ్యాడు. జరిగింది తీవ్రంగా తీసుకొని బ్రిటీష్ ప్రభుత్వం, సీతారామరాజు, అతని అనుచరుల మీద, అడవుల్లో తిరగడంలో అనుభవం ఉన్న మలబార్ స్పెషల్ పోలీసులను ప్రయోగించింది. ఇక్కడ నుంచి మొదలయింది అసలు గొడవ.

నిజానికి నాన్ బెయిలబుల్ వారంట్ల జారీకి ముందు అల్లూరి సీతారామరాజు పోలీసువారితో అత్యంత సన్నిహితంగా ఉండేవాడని, వాళ్ళు ఇచ్చిన దుస్తులు ధరించేవాడని, సీతారామరాజుని గుడాల్ కాల్చి చంపినపుడు సీతారామరాజు పోలీసులు ఇచ్చిన ఖాకీ నిక్కరే ధరించి ఉన్నాడని అంటారు. నిజం చెప్పాలంటే సీతారామరాజు తన జీవితంలో ఎన్నడూ కాషాయ దుస్తులు ధరించ లేదు. ఎప్పుడైతే మలబార్ స్పెషల్ పోలీసు షూట్ ఎట్ సైట్ ఆర్డర్‌తో రంగంలోకి దిగిందో, సీతారామరాజు, అతని అనుచరులకు ఆత్మరక్షణకోసం తుపాకులు అవసరం అయ్యాయి.


వాళ్ళు పోలీసు స్టేషన్లు లూటీ చేసి, తుపాకులు, తూటాలు పట్టుకు పోవడం మొదలైంది. అలాగే అడవిలో తిరుగుతూ తిండికి కటకటలాడుతున్న సీతారామరాజు, అతని అనుచరులు సంత బండ్లను కొల్లగొట్టి ఆహార ధాన్యాలను దోచుకుపోయేవారని, వాళ్ల మీద రాజవొమ్మంగి స్టేషన్‌లో దారిదోపిడీ కేసులు నమోదు అయినాయి. ఈ విషయాలు రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ పార్ట్ 4లో సవివరంగా రాసి ఉన్నాయి.


సీతారామరాజుగురించి ఓ ప్రస్తావనలో టంగుటూరి ప్రకాశం గారు 'హి ఈజ్ ఎ డెకాయిట్' (అతను ఒక దోపిడీ దొంగ) అని అభివర్ణించారంటారు. నేతాజీ అల్లూరిని పొగిడారు అని కొందరంటారు. అల్లూరి సీతారామరాజు మీద నేతాజీ అవగాహన కంటే ప్రకాశం గారి అవగాహనకే విశ్వసనీయత ఉండడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు మీద రిజిష్టరు అయిన కేసులన్నీ దొంగతనం, దోపిడీల క్రిందే కాని కుట్ర రాజద్రోహం లాంటి కేసులు ఎక్కడా రిజిష్టరు కాలేదు.


బ్రిటీష్ ప్రభుత్వం సీతారామరాజుని రాజద్రోహిగా, కుట్రదారునిగా కాకుండా దోపిడీ దొంగగా తన రికార్డుల్లో పేర్కొంది. రాజద్రోహం, కుట్ర కేసులు నమోదు చేసే అవకాశాన్ని ఏ ప్రభుత్వం, ముఖ్యంగా వలసవాద ప్రభుత్వం వదలు కోదు. ఎందుకంటే అటువంటి చర్యలకు పాల్పడిన వారిని ఎన్‌కౌంటర్‌లో అయినా చంపవచ్చు లేదా ఉరిశిక్ష అయినా విధించవచ్చు. తన సార్వభౌమత్వాన్ని కాపాడుకొనే హక్కు ప్రతి ప్రభుత్వానికి ఉంటుంది.


మరి అటువంటి అవకాశం బ్రిటీష్ ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు విషయంలో ఎందుకు వదలుకొంది? అదే బ్రిటీష్ ప్రభుత్వం భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్, చంద్రశేఖర్ అజాద్‌ల మీద ఎందుకు కుట్ర, రాజద్రోహం కేసులు నమోదు చేసింది? అలా వ్యత్యాసం చూపాల్సిన అవసరం బ్రిటీష్ ప్రభుత్వానికి ఎందుకుంటుంది? మరి విచారిస్తే భగత్ సింగ్ త్రయం, ఆజాద్‌ల పోరాటం దేశం కోసం, సీతారామరాజుది అరవై ఎకరాల పొలం కోసం.


ఆయుధాల కోసం అడ్డతీగల పోలీసు స్టేషన్ లూటీ చేసిన సీతారామరాజు, పోలీసు స్టేషన్ రికార్డుల్లో తాను ఎన్ని తుపాకులు, ఎన్ని తూటాలు పట్టుకు పోతున్నది రాశాడుగాని, బ్రిటీష్ వారు దేశం విడిచి పోవాలని కాని, దేశానికి స్వాతంత్య్రం కావాలని కానీ, అవకాశం ఉన్నా రాయలేదు. అక్కడే కాదు తాను విజిట్ చేసిన అడ్డతీగల తహసిల్దార్ కార్యాలయం రికార్డుల్లోనే కాదు మరెక్కడా రాయలేదు. మరి ఆయన చక్కని లేఖకుడు కదా!


అలాగే పడాల వీరభద్రరావుగారు మల్లు దొర 1923 సెప్టెంబర్ 17న కౌర్సన్ అనే దొర సేనానికి దొరికినట్లుగా రాసారు. నిజానికి పోలీసు రికార్డుల ప్రకారం మల్లు దొర లాగ్వయి గ్రామంలో వివాహేతర సంబంధం ఉన్న మహిళ ఇంట్లో తప్పతాగి నిద్రపోతుండగా స్థానిక పోలీసులు అరెస్టు చేసినట్లు రికార్డులు చెబుతాన్నాయి. ఇది గుడ్డిగా మల్లుదొరని హీరోని చేసే ప్రయత్నమే తప్ప వేరొకటి కాదు.


సీతారామరాజు పితూరి అంతా అయిదారు పోలీసు స్టేషన్ల పరిధిలో జరిగింది. ఆయన దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్నానని ఏ ప్రభుత్వ రికార్డులలో గాని, మరే ఉత్తరాలలో గాని తన స్వహస్తాలతో రాసినట్లు చూపించగలరా? పడాల రామారావుగారు సీతారామరాజు చేసిన పరిశోధనలో, సీతారామారాజు గురించి ఆయనకు చెప్పగిలగే వారు అతి తక్కువ మంది అయి ఉంటారు. పడాల రామారావుగారు సీతారామరాజు గురించి ప్రభుత్వ రికార్డులలో ఉన్నది అసలు పరిశీలించకుండా/గణనకు తీసికోకుండా రచనలు చేయడం పాడి కాదు. రాజమండ్రివాసి అయిన పడాల రామారావు రాజవొమ్మంగి పోలీసు స్టేషన్ పార్ట్ 4 పరిశీలించి అసలు సీతారామారావు గురించి ఏమి రాసి ఉందో కనీస మాత్రం తెలుసుకునే ప్రయత్నం చేయాలి.

అలా చేయకపోగా సీతారామరాజును దేశభక్తుడిగా, వీరుడిగా చిత్రించారు. బ్రిటీష్ వారు మన్యం ప్రజల్ని దోచేస్తుంటే అల్లూరి సీతారామరాజు అడ్డుకునేవాడు అనేవారికి, బ్రిటీష్ వారు మొత్తం దేశాన్నే దోచారని, మన్య ప్రజల్ని ఒక్కర్నే కాదని తెలియదా? బిట్రీష్ వాళ్ళు మన్యంలో చింతపండు, శీకాయ వ్యాపారం చేయలేదు అని మనవి. మనం దండలు వేసి గౌరవించే సీతారామరాజు విగ్రహం దేశభక్తుడిదా, భూకబ్జాదారుడిదా, లేదా ప్రకాశం పంతులు అన్నట్లు బందిపోటు దొంగదా? అని తెలుసుకోవలసిన బాధ్యత ప్రతి తెలుగువాడిపై ఉంది.



No comments:

Post a Comment

 మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా...