Friday, May 13, 2022

ఉయ్యాలవాడ

 ఉయ్యాలవాడ ఎవరు? ఆయన చరిత్ర ఏంటి? అంటూ వెతకడం మొదలుపెట్టారు. మనకు తెలియని ఓ ఉద్యమకారుడి గురించి తెలుసుకునేలా సైరా సినిమా ప్రభావం అందరిపై పడింది. కొందరు అతనే తొలి స్వాతంత్ర్య సమరయోధుడు అంటారు.. మరికొందరు తమకు దక్కాల్సిన రాజాభరణాల విషయంలో జరిగిన అన్యాయంపై తిరుగుబాటు చేసిన పాలెగాళ్ల నాయకుడు మాత్రమే అంటారు. అయితే ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి ఎవరు? ఆయన చరిత్ర ఏంటి? అతను బ్రిటీష్‌ వాళ్లను ఎందుకు ఎదిరించాడు?


ఉయ్యాల వాడ చరిత్ర దాదాపు 150 ఏళ్ల క్రితం నాటిది. 18వ శతాబ్ధంలో రాయలసీమలో పాలెగాళ్ల వ్యవస్థ అమలులో ఉండేది. ఆ పాలెగాళ్లలో ఉయ్యాలవాడ కూడా ఒకరు. దాదాపు 80 మంది పాలెగాళ్లు నిజాం నవాబు బ్రిటిషు ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేశారు. నరసింహారెడ్డి తల్లి నీలమ్మ ఉయ్యాలవాడ కాపు పెదమల్లారెడ్డి రెండో భార్య. ఆమె తండ్రి కూడా జమిందారే. పేరు జయరామిరెడ్డి. అతనికి కొడుకులు లేకపోవడంతో మనవడు నరసింహారెడ్డిని దత్తత తీసుకున్నారు. జయరామిరెడ్డి మరణం తరువాత పాలెగాళ్లకు ఇచ్చే భరణాన్ని రద్దు చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. అతడి వారసుడైన నరసింహారెడ్డికి ఇచ్చేందుకు నిరాకరించింది. అంతేకాదు భరణం కొరకు తన అనుచరుడిని పంపిస్తే చాలా అవమానించి పంపాడు తహసీల్దార్. ఆ అవమానం నరసింహారెడ్డిలో ఉద్యమ కాంక్షను పెంచింది.

బ్రిటీష్‌ వాళ్లపై ఉయ్యాలవాడ పోరాటం

తనతో కలిసి వచ్చిన ఇతర పాలెగాళ్లను కూడగట్టుకుని.., 500 బోయసైన్యమంతో కలిసి బ్రిటిష్ ట్రెజరీపై 1846 జులై 10న దాడి చేశారు. ఆ ట్రెజరీ కోయిలకుంట్లలో ఉంది. అక్కడున్న తహసీల్దారును కూడా చంపేశారు. దీంతో బ్రిటిష్ సైన్యం అతనిని వెతకడం మొదలుపెట్టింది. అతడిని పట్టుకున్న వారికి భారీ బహుమతులు కూడా ప్రకటించారు. నరసింహారెడ్డి మరింత సైన్యాన్ని సమకూర్చుకుని గిద్దలూరు వద్ద కెప్టెన్ వాట్సన్ తో యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో చాలా మేరకు సైన్యాన్ని నష్టపోయారు నరసింహారెడ్డి.

1846 అక్టోబర్‌లో నల్లమల కొండల్లో ఉన్న జగన్నాథ ఆలయంలో ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి ఉండగా బ్రిటిష్ సైన్యం అతడిని బంధించింది. అతడితో పాటూ కొన్ని వందల మందిని పట్టుకుంది. వారిలో ఒక్కొక్కరికి ఒక్కోలా శిక్ష వేశారు. వేలమందిలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన ఉయ్యాలవాడ నర్సింహారెడ్డిపై బందిపోటు దొంగగా ముద్ర వేసింది బ్రిటిషు ప్రభుత్వం. బ్రిటీష్‌ ప్రభుత్వంపై ఉయ్యాలవాడ తిరుగుబాటు చేశారని, హత్యలు, దోపిడిలకు పాల్పడ్డాడని, అతడో దోపిడి దొంగ అని బ్రిటిష్ కమిషనర్ తీర్పునిచ్చారు. అతనికి ఉరిశిక్ష వేస్తున్నట్టు ప్రకటించారు. 1847 ఫిబ్రవరి 22 ఉదయం 7 గంటలకు కలెక్టర్ కాక్రేన్ సమక్షంలో కోవెలకుంట్ల సమీపంలో ఉన్న జుర్రేరు ఒడ్డున ప్రజలందరూ చూస్తుండగా బహిరంగంగా ఉరితీశారు. అతడి తలను 1877 దాకా కోయిలకుంట్ల కోటలో ఉరికొయ్యకు వేలాడదీసే ఉంచారు. అంతే కాకుండా నరసింహారెడ్డితో పాటు పట్టుబడిన వందల మందిపై కేసు పెట్టారు. వీరిలో కొంతమందికి జైలు శిక్ష వేయగా.. మరికొందికి ద్వీపాంతర శిక్ష పడింది.

తొలి స్వాతంత్ర్య సమరయోధుడు!

భారత స్వాతంత్ర్య సంగ్రామంలో 1857 సిపాయిల తిరుగుబాటుకి ప్రత్యేక స్థానం ఉంది. ఆ సంఘటనకు పదేళ్ల ముందే ఓ వీరుడు తెల్ల దొరలపై ఎర్ర జెండా ఎగురువేశాడు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని తొలి స్వాతంత్ర్య పోరాట యోధుడిగా కేంద్రం గుర్తించింది. ఆయన 170వ వర్థంతి సందర్భంగా 2017లో ఓ పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశారు. ఒంటరిగా పోరాటం మొదలుపెట్టి వందల కొద్దీ సైన్యాన్ని సమకూర్చాడు. అతడు బ్రిటిషు సైన్యాన్ని సమర్థంగా ఎదుర్కొలేకపోవచ్చు, ఏడాది కూడా తన పోరాటాన్ని కొనసాగించలేక ప్రాణాలు విడిచి ఉండొచ్చు... కానీ అతని పోరాటం ఎంతో మందిలో ఉద్యమ స్పూర్తిని నింపింది. వేల మంది స్వాతంత్ర్య ఉద్యమం పట్ల అడుగులేసేలా చేసింది.

No comments:

Post a Comment

 మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా...