Friday, May 6, 2022

అల్లూరి

 అల్లూరి సీతారామరాజు పేరు చెప్పగానే ఒక ఉత్తేజం కలుగుతుంది. ప్రతీ తెలుగువాడిలో ఆ స్థాయి ముద్ర వేశారాయన. ఆయన సాగించిన మన్య ఉద్యమానికి సంబంధించిన అనేక అంశాలు ఇంకా బయటకి రావాల్సి ఉంది.



అలాంటి వాటిలో ఇదిగో ఈ బ్రిటీష్ అధికారులకు సంబంధించిన రెండు సమాధులు కూడా ఉన్నాయి.

దోపిడీకి గురవుతున్న గిరిజనులకు అండగా ఉద్యమం మొదలు పెట్టిన అల్లూరి సీతారామరాజు 1922 ఆగస్టు 22న మొదటిసారిగా చింతపల్లి, ఆ తరువాత 23, 24 తారీఖుల్లో కృష్ణ దేవిపేట, రాజవొమ్మంగి స్టేషన్లపై దాడిచేసి రిజిస్టర్‌లో సంతకాలు చేసి మరీ ఆయుధాలను పట్టుకెళ్ళాడు. వాటిలో 26 తుపాకులు, 2500 తూటాలు ఉన్నాయి. ఇది బ్రిటీష్ ప్రభుత్వం కలలో కూడా ఊహించనిది.

బ్రిటీష్ కాలంలో పోలీస్ స్టేషన్‌లను చూస్తేనే సామాన్య జనం అందునా గిరిజన ప్రాంతాల్లో ఉండేవారు వణికిపోయేవారు. అలాంటిది ఏకంగా పోలీస్ సిటీషన్‌పై దాడి అనేది బ్రిటీష్ అధికారులు సహించలేకపోయారు. ఎలాగైనా అల్లూరి సీతారామరాజుని అణచి వెయ్యాలని అనుకున్నారు. అటవీ ప్రాంతంలో గాలింపు మొదలుపెట్టారు.

అల్లూరు సీతారామరాజుని వెతికే క్రమంలో 1922 సెప్టెంబర్ 3 న బ్రిటీష్ పోలీసులకు, అల్లూరి దళానికి మధ్య చిన్నయుద్ధం జరిగింది. దానిలో అల్లూరి సీతారామరాజు సైన్యం విజయం సాధించగా ఒక బ్రిటీష్ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఇది బ్రిటీష్ సైన్యం ప్రతిష్ఠకు తీవ్ర భంగం కలిగించింది. రామరాజు పేరు మన్యం ప్రాతంలో మారుమోగిపోయింది. మరింత పట్టుదలకుపోయిన బ్రిటీష్‌ సైనం ఎలాగైనా అల్లూరిని మట్టు బెట్టాలని భావించిన షికారీగా పేరున్న్ క్రిస్టఫర్ విలియం స్కాట్ కోవర్డ్, లియోనెల్ నివెల్లే హైటర్ అనే ఇద్దరు అధికారులను రంగంలోకి దింపింది.

షికారీ అంటే మృగాల వేటగాడు కాదు.. మనుషుల వేటగాడు

వీరిలో స్కాట్ కోవర్డ్‌ను షికారీగా పిలవడం వెనుక ఒక పెద్ద కథే ఉంది. సాధారణంగా వేటగాళ్లను షికారీలని పిలుస్తారు. కానీ బ్రిటీష్ సైన్యంలో తమ ప్రభుత్వానికి ఎదురు తిరిగిన వాళ్ళని నిర్దాక్షిణ్యంగా వేటాడే వాళ్లను షికారీలని పిలిచేవారు. అల్లూరి ఉద్యమం కంటే ముందే జరిగిన జలియన్ వాలా బాగ్ హత్యాకాండ జరిపిన జనరల్ డయ్యర్‌ను కూడా ఆంగ్లేయులు షికారీ అని పిలుచుకున్నారు.

అల్లూరి కథలోకి వస్తే స్కాట్ కోవర్డ్ 1895 29 మేలో జన్మించాడు. సైన్యంలో నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తాడు అనే పేరున్న స్కాట్ ను అల్లూరి సీతా రామరాజును చంపడం కోసం అసిస్టెంట్ సూపరెండెంట్ హోదాలో నియమించారు. 1914 నుంచి 1920 వరకూ బ్రిటీష్ ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన హైటర్‌ను కూడా అదే హోదాలో ప్రత్యేకంగా పిలిపించారు. ఆయన 11 సెప్టెంబర్ 1896 లో జన్మించాడు . వీళ్లిద్దరికీ అప్పజెప్పిన టాస్క్ ఒకటే అల్లూరి సీతా రామరాజును చంపడం.

అల్లూరి ఆచూకీ కోసం మొదలైన వేట :

అల్లూరి సీతారామరాజును ఎలాగైనా మట్టుబెట్టాలనే తమ ఆశయం కోసం ఈ ఇద్దరు అధికారులూ స్థానిక గిరిజనులను ప్రశ్నించడం , వేధించడం మొదలుపెట్టారు. అటవీప్రాంతం మొత్తం జల్లెడపట్టారు. అయినప్పటికీ ఫలితం దక్కకపోవడంతో అల్లూరి ఆచూకీ కోసం స్థానికులపై ఒత్తిడి పెంచారు. అల్లూరిని పట్టిచ్చిన వారికి బహుమతి కూడా ప్రకటించారు.

మొదలైన వ్యూహాలు :

ఎలాగైనా సరే అల్లూరి సీతారామరాజుని పట్టుకోవాలన్న ఈ ఇద్దరు అధికారులు రామరాజు ఉద్యమం పట్ల సానుభూతిపరులపై కన్నేశారు. వాళ్ళ నుంచి రాబట్టిన సమాచారంతో గూడెం కొండల ప్రాంతంలో సీతారామరాజు ఉన్నాడని ఆయన్ను చంపడానికి బయలుదేరి వెళ్లారు. 1922 సెప్టెంబర్ 24న ఎటాక్ ప్లాన్ చేశారు. దీనిపై ముందుగానే సమాచారం అందుకున్న అల్లూరి సీతారామరాజు దళం దానికి ప్రతివ్యూహంతో రెడీగా ఉన్నారు.

అల్లూరి సీతారామరాజును మట్టుబెట్టాలని ఉత్సాహంగా బయల్దేరి వెళ్తున్న బ్రిటీష్ సైన్యానికి అనుకోని విధంగా అల్లూరి దళం ఎదురు తిరిగింది. దామనపల్లి ఘాట్ వద్దకు బ్రిటీష్ సైన్యం చేరుకోగానే మెరుపు దాడి చేసింది. పెద్ద ఎత్తున తుపాకులూ, సైన్యం వెంట ఉన్నా స్కాట్‌ సైన్యం ఏం చేయలేకపోయింది. ఘాట్‌ రోడ్డుకు ఇరువైపుల ఎత్తైన ప్రాంతాల్లో దాక్కొని దాడి మొదలు పెట్టింది అల్లూరి సైన్యం. దీంతో స్కాట్,హైటర్‌ అల్లూరి దళాన్ని ఏమీ చేయలేకపోయారు.

తీవ్రంగా పోరాడిన స్కాట్,హైటర్ యుద్ధ భూమిలో కన్నుమూశారు. ఇద్దరి తల్లోకి తూటాలు దూసుకుపోవడంతో అక్కడిక్కక్కడే మృతి చెందారు. ఈ దాడి టైంలో అల్లూరి సీతారామరాజు ఆ ప్రాంతంలో లేరు. ఉత్తరాది యాత్రలో ఉన్నారు. అయినా బ్రిటిష్‌ వారి ప్లాన్ తెలుసుకొని గెరిల్లా పద్దతిని అనుసరించారు. ఈ దాడిలో పాల్గొన్న భారతీయ సైనికులు ఎవరికీ ఎలాంటి హానీ తలపెట్టలేదు. అందుకే స్కాట్‌, హైటర్‌ డెడ్‌బాడీలను అక్కడే వదిలేసి సైనికులు వెళ్లిపోయారు.

జరిమానా కట్టి డెడ్‌బాడీలను తెచ్చుకున్న బ్రిటీష్ అధికారులు :

స్కాట్ ,హైటర్ మరణం, కనీసం వాళ్ళ శవాలను కూడా వెనక్కు తెచ్చుకోలేని పరిస్థితిలో తాము ఉండడం అనేది బ్రిటీష్ అధికారులకు తల కొట్టేసినట్టైంది. అయినా చేసేది లేక తమ వద్ద పని చేసే భారతీయులకు తెల్ల జెండా ఇచ్చి శాంతి మంత్రం పాటిస్తూ డెడ్‌బాడీలను పడి ఉన్న దామనపల్లి ఘాట్ వద్దకు వెళ్లారు. అక్కడే ఉన్న అల్లూరి సీతారామరాజు దళాన్ని తమ అధికారుల మృతదేహాలను అప్పజెప్పాలని కోరారు.

లేనిపోని ఆంక్షలతో స్థానిక గిరిజనుల ఉపాధి దెబ్బతీసినందుకు, వారిని బాధించినందుకు 500 రూపాయల జరిమానా విధించారు అల్లూరి సీతారామరాజు. దానితో ఆ జరిమానా కట్టి ఆ స్కాట్ ,హైటర్ డెడ్‌బాడీలను వెనక్కు తెచ్చుకున్నారు బ్రిటీష్ వాళ్ళు. వాటిని నర్సీపట్నంలో సమాధి చేశారు. ఆ సమాధులపై వారి వివరాలు చెక్కించిన బ్రిటీష్ అధికారులు వాటి రక్షణ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

ముళ్లపొదలు-పిచ్చి మొక్కల మధ్య ఆ రెండు సమాధులు :

ఆ సమాధులు ఉన్న ప్రాంతం నాశనం కాకూడదని, స్వాతంత్య్రం ఇచ్చేసమయంలో ఓ కండిషన్‌ పెట్టింది బ్రిటిష్ ప్రభుత్వం. ఇదొక్కటే కాదు దేశంలో తాము నిర్మించిన అనేక కట్టడాలకు కూడా ఇదే కండిషన్ పెట్టారు బ్రిటీషర్లు. ఆయా ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలూ చేపట్టొద్దన్నారు.

ప్రస్తుతానికి ఆ ప్రాంతం అలానే ఉన్నా .. చుట్టూ రకరకాల కట్టడాలువచ్చేసాయి. ఆ సమాధులు ఉన్న ప్రాంతం కూడా ఎలాంటి శుభ్రత లేకుండా ముళ్ల పొదలతో నిండి పోయింది. నర్సీపట్నంలోని ప్రజల్లో చాలామందికి సైతం ఈ సమాధుల చరిత్ర తెలియదు.

అల్లూరి రగిల్చిన స్ఫూర్తి- నిత్య నూతనం :

అల్లూరిని వేటాడడానికి వెళ్లి తామే బలైన వేటగాళ్ల కథ ఇది. అల్లూరి సీతారామరాజు విప్లవాన్ని కేవలం ఒక పితూరీగా తగ్గించి చూపాలన్న బ్రిటీష్ కథనాలకు.. నిజానికి ఆయన నడిపిన ఉద్యమం ఎంత తీవ్రతరమైందో తెలిపే సంఘటనకు సాక్ష్యం ఈ సమాధులు. ఆయన ప్రాణాన్ని తీయడానికి ఎందుకు బ్రిటీష్ వాళ్ళు తహతహ లాడిపోయారో ఈ సమాధులను చూస్తే తెలుస్తుంది. అందుకే తరువాత కాలంలో నిరాయుధుడిగా ఉన్న అల్లూరిని అంత కిరాతకంగా చెట్టుకు కట్టేసి మరీ దారుణంగా చంపారు ఆంగ్లేయులు. అలా తమ కసినైతే తీర్చుకున్నారేమో గానీ తరతరాలుగా తెలుగువాళ్లలో అల్లూరి సీతారామరాజు రగిలించిన స్ఫూర్తిని మాత్రం అడ్డుకోలేకపోయారు

No comments:

Post a Comment

 మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా...