Monday, May 2, 2022

సంస్కృతం

 హిందీని జాతీయ భాషగా గుర్తించాలంటూ ఓ డిమాండ్ కూడా కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో మోస్ట్ డిబేటబుల్ టాపిక్. కన్నడ స్టార్ సుదీప్, బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్‌ల మధ్య భాష విషయంలో జరిగిన వివాదం కూడా దీనికి తోడైంది. ఇప్పుడు వీటన్నింటినీ కాదని మరో నినాదం ప్రచారంలోకి వచ్చింది. అదే సంస్కృతాన్ని జాతీయ భాషగా గుర్తించాలనే డిమాండ్.

ఎందుకంటే మన దేశంలో అన్ని భాషలకు మూలం సంస్కృతమే అని ఆ భాషలోనే మన వేదాలు ఉన్నాయ్ కాబట్టి తమది జెన్యూన్ డిమాండ్ అనీ వీళ్లు అంటున్నారు. దీన్ని కేంద్రప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని చాలా మంది ట్వీట్లు కూడా చేస్తున్నారు.



సంస్కృతాన్ని జాతీయ భాషగా గుర్తించాలా వద్దా అనే విషయాన్ని వదిలేసి అసలు దేశంలోని భాషలకు మూలం సంస్కృతమే అన్న వాదన ఎంత వరకు నిజమనేది తెలుసుకుందాం. చాలా మంది అనుకునేట్లు భారతీయ భాషలకు మూలం సంస్కృతం కాదు. ప్రత్యేకించి తెలుగు, తమిళ, మలయాళ భాషలకు అసలు ఏ మాత్రం సంబంధం లేదు. అసలు కనీసం అవి ఒకే ఫ్యామిలీకి చెందిన భాషలు కూడా కావు.

మరి సంస్కృతం ఎక్కడి నుంచి వచ్చింది?

మన దేశ జనాభాలో 99 శాతం మంది మాట్లాడే 121 ప్రధాన భాషలు ఐదు వేర్వేరు భాషా కుటుంబాలకు చెందినవి. ఇది మేం చెబుతున్నది కాదు కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ అధికారిక వెబ్ సైట్‌లో ఉన్న వివరాలే.

ఈ వివరాల ప్రకారం

1. ఇండో-యూరోపియన్ కుటుంబం
2. ద్రవిడియన్ లాంగ్వేజెస్
3. ఆస్ట్రో-ఏసియాటిక్
4. టిబెటో-బర్మీస్
5. సెమిటో హామిటిక్

1. ఇండో యూరోపియన్ కుటుంబం

ఇండోయూరోపియన్ అంటే ఇండియా, యూరోపియన్ ఖండం ప్రాంతంలో మాట్లాడే భాషల ఫ్యామిలీ అన్న మాట. మళ్లీ ఇండో యూరోపియన్ లో మూడు శాఖలు ఉన్నాయి. ఇండో-ఆర్యన్, ఇరానియన్, జెర్మానిక్ అనే మూడు మూడు శాఖల భాషలు భారతదేశంలో ఉన్నాయి.

ఎ) ఇండో-ఆర్యన్ శాఖ: బంగాలీ దగ్గర మొదలు పెడితే డోగ్రీ, గుజరాతీ, హిందీ, కశ్మీరీ, మరాఠి, నేపాలీ, పంజాబీ, సంస్కృతం, ఉర్దూ ఇలాంటి భాషలన్నీ ఇండో ఆర్యన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన భాషలు.

బి) ఇరానియన్ శాఖ: 1. అఫ్ఘానీ/కాబూలీ/పష్తో

సి) జెర్మానిక్ శాఖ: 1. ఇంగ్లిష్

2. ద్రవిడియన్ కుటుంబం గురించి మాట్లాడుకుంటే తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ నుంచి మొదలు పెట్టి, తులు, మాల్టో, గోండి లాంటి భాషలు ద్రవిడియన్ ఫ్యామిలీకి చెందినవి.

3. ఆస్ట్రో-ఏసియాటిక్: భుమీజ్, గడబ, హో, జువాంగ్, ఖారియా, ముండారి, సవర లాంటి భాషలన్నీ ఆస్ట్రో ఏసియాటిక్ లాంగ్వేజెస్ ఫ్యామిలీ నుంచి వచ్చాయి. ప్రత్యేకించి ఈ ఫ్యామిలీలో ముండారీ అనే భాషను చోటా నాగ్ పూర్ ప్లేట్ లో...మోన్ ఖేమర్ భాషను నార్త్ ఈస్ట్, అండమాన్ నికోబార్ దీవుల్లో మాట్లాడతారు.

4. టిబెటో-బర్మీస్: బోడో, మణిపురి,గారో, కుకీ, లడాఖీ, షేర్పా, టిబెటన్, త్రిపురి తదితర 66 భాషలు ఈ కుటుంబానికి చెందినవి. మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో ప్రజలు వినియోగించే భాషను ఈ భాషా కుటుంబానికి చెందినవి.

5. సెమిటో హామిటిక్: అరబిక్/అరబీ

భారతదేశంలో అత్యధికులు అంటే 78 శాతం మందికి పైగా మాట్లాడే హిందీ తదితర 21 ప్రధాన భాషలు.. ఇండో-యూరోపియన్ కుటుంబంలోని ఇండో-ఇరానియన్ శాఖకు మళ్లీ దాంట్లో ఉపశాఖ అయిన ఇండో-ఆర్యన్ వర్గంలోకి వస్తాయి. ఇప్పుడు మన హిందీ కావచ్చు..సంస్కృతం కావచ్చు ఈ ఇండో ఆర్యన్ సమూహానికి సంబంధించిన భాషలు.ప్రస్తుతం ఇండో-యూరోపియన్ కుటుంబంలో ఎనిమిది శాఖలుగా మొత్తం 448 భాషలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ప్రాచీన గ్రీకు, లాటిన్, సంస్కృతం మొదలుకొని.. ఆధునిక ఇంగ్లిష్, జర్మన్‌లతో పాటు హిందీ తదితర భాషలు ఇందులో ఉన్నాయి.

ఇండో-యూరోపియన్ భాష మాట్లాడే ఆర్యులు సుమారు క్రీ.పూ 1,500 సంవత్సరాల కిందట భారత దేశంలోకి వాయవ్య ప్రాంతం నుంచి విస్తరించారని భాషాశాస్త్ర పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

సంస్కృతం - హిందీ...

ఇతర భారతీయ ఇండో-ఆర్యన్ భాషల తరహాలోనే వేద సంస్కృతం నుంచి హిందీ పుట్టింది. ఈ క్రమంలో అనేక పరిణామాలు, ప్రభావాలు ఉన్నాయి. వేద సంస్కృతం 1,500 బీసీ కన్నా పురాతనమైనదని భాషాశాస్త్రవేత్తల అంచనా. తొలి వేదమైన రుగ్వేదం ఈ కాలానికి చెందిందని.. వేద సంస్కృతం క్రమంగా మారుతూ 250 బీసీ నాటికి ప్రాచీన వేదంగా రూపొందింది. కొంత కాలం పాటు సాహిత్య, శాసన భాషగా కొనసాగింది. కాల క్రమంలో వ్యాఖ్యానాలకు పరిమితమైపోయింది.

మరోవైపు 500 బీసీఈ నాటికి సామాన్య ప్రజల వాడుక భాష అయిన ప్రాకృతం ప్రాధాన్యం పెరిగింది.

తిణ దోసాని ఖేత్తాని
దోస దోస ఆయం పజా
తస్మాతి వీత దోశేషు
దిన్నం హోతి మహప్ఫలం..!

ఇది అంతరించిపోయిన ప్రాకృత భాషకు సంబంధించిన పద్యం. బౌద్ధులు, జైనులు చాలా వరకూ ఈ ప్రాకృత భాషలోనే గ్రంథాలు రచించారు. క్రీపూ 268 నుంచి 232 వరకూ భారత ఉపఖండాన్ని పరిపాలించిన అశోకుడి శాసనాలను కూడా ఈ వాడుక భాషలోనే వేయించారు.

మళ్లీ క్రీ.శకం 400 నాటికి ప్రాకృతంలోనే అపభ్రంశ మాండలికం ప్రాచుర్యం పొందింది. ఈ అపభ్రంశ నుంచి ఏడో శతాబ్దం నాటికి హిందీ ఆవిర్భావం మొదలైంది. నిజానికి అప్పటికి హిందీ భాషగా దీనికి నామకరణం చేయలేదు. మొఘలుల ఆస్థాన కవి అమీర్ ఖుస్రో 13వ శతాబ్దంలో తను 'హైందవి' భాషలో కవితలు రాసినట్లు చెప్పాడు.అంతకుముందు.. ఇండస్ - అంటే సింధూ నదికి తూర్పున 'హింద్' ప్రాంతంలో నివసించే వారిని చెప్పటానికి 'హిందీ' అనే పదాన్ని ఉపయోగించేవారు. ప్రాచీన పర్షియన్ భాష నుంచి ఈ పదం పుట్టింది. ఆ భాషలో 'హిందీ' అనే పదానికి అర్థం నేటి 'ఇండియన్'.

హిందీ, ఉర్దూలు రెండూ.. భాషాశాస్త్రపరంగా ఒకే ఉప మాండలికానికి చెందిన భిన్న సాహిత్య శైలులు. సాధారణంగా ఉపయోగించేటపుడు ఈ రెండు భాషలూ దాదాపు ఒకే విధంగా ఉంటాయి. కొన్ని పదాలు, పలికే తీరుల్లో స్వల్ప తేడాలు మాత్రమే ఉన్నాయి. లిపి కోసం హిందీ దేవనాగరిని ఉపయోగిస్తే.. ఉర్దూ పర్సో-అరబిక్ లిపిని ఉపయోగించారు.

స్వాతంత్య్రానికి ముందు.. స్వతంత్ర భారత జాతీయ భాషగా హిందుస్థానీ భాషను ప్రకటించాలని మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ తదితరులు భావించారు. అయితే.. పాకిస్థాన్ విడివడిన తర్వాత ఉర్దూను ఆ దేశ జాతీయ భాషగా ప్రకటించుకుంటే.. హిందీని భారతదేశ అధికార భాషగా చేశారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 343 ప్రకారం హిందీ అధికార భాష మాత్రమే. జాతీయ భాష కాదు.

ద్రవిడ భాషలు

సుమారు 6,000 సంవత్సరాల కిందట మూల ద్రవిడ భాష (ప్రోటో-ద్రవిడియన్ లాంగ్వేజ్) మాట్లాడేవారు. ఈ భాష మాట్లాడే ద్రవిడులు వాయవ్య దిశ నుంచి భారత ఉపఖండంలోకి ప్రవేశించి ఉంటారని.. సింధు నాగరికత వీరిదే అయి ఉండవచ్చునని కొందరు పరిశోధకులు ప్రతిపాదించారు. మరికొంత మంది ద్రవిడులు పూర్తిగా భారత్‌లోనే ఉద్భవించిన తెగ అని చెబుతారు మరికొంత మంది ద్రవిడులు పశ్చిమ ఆఫ్రికా ప్రాంతం నుంచి వలస వచ్చిన జాతిగా అభివర్ణిస్తారు. వీటిలో ద్రవిడులు ఎలా వచ్చారనేది నిర్దిష్టమైన సమాధానం లేకపోయినా...ద్రవిడ భాషలు ఇండో ఆర్యన్ భాషలకు సంబంధం లేదని మాత్రం స్పష్టమవుతోంది. భారత దేశంలోకి ఆర్యుల రాకతో...ద్రవిడ భాషలు మాట్లాడేవారు చాలా మంది ఆర్య సమాజంలో కలసిపోగా.. ప్రతిఘటించిన ద్రవిడులు క్రమంగా తూర్పు, దక్షిణ దిశలకు కదలిపోయారని భాషా పరిశోధకులు చెబుతూ ఉంటారు.

మూల ద్రావిడ భాష సుమారు 5,000 సంవత్సరాల కిందట

1) దక్షిణ ద్రావిడ
2) దక్షిణ మధ్య ద్రావిడ
3) మధ్య ద్రావిడ
4) ఉత్తర ద్రావిడ అనే నాలుగు శాఖలుగా విడిపోయింది.

ప్రస్తుతం ద్రవిడ భాషలలో అతి పెద్ద భాషలుగా ఉన్న తమిళం, మలయాళం, కన్నడ భాషలు దక్షిణ ద్రావిడ శాఖ నుంచి.. తెలుగు భాష దక్షిణ మధ్య ద్రావిడ నుంచి ఉద్భవించాయని చెబుతారు. ఆర్యులు 1500 బీసీ కాలంలో భారత ఉపఖండంలోకి ప్రవేశించేటప్పటికి అక్కడ ప్రధానంగా ఉన్న ద్రవిడ భాషా శాఖతో వారితో కలవటం వల్ల రుగ్వేదంలో సైతం కొన్ని ద్రవిడ భాషా పదాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తారు.

500 బీసీ నాటికి పాళీ, ప్రాకృతి వంటి వాడుక భాషలు ప్రాచుర్యం పొందటం ఆరంభమైంది. బౌద్ధ, జైన మతాలు రాజ్యాల ప్రోద్బలంతో ఉచ్ఛస్థితికి ఎదగటంతో.. ప్రాకృత భాషలు స్థిరపడగా సంస్కృతం క్రమంగా మొదటి భాష స్థానాన్ని కోల్పోయింది. పతంజలి కాలం నాటికి ప్రాకృత భాష తొలి భాషగా మారిపోగా.. సంస్కృతం మంత్రాలకు పరిమితమైంది.

వెయ్యేళ్ల కాలంలో ఈ భాషల్లో వేగంగా మార్పులు రావటం ప్రారంభించాయి. ప్రత్యేకించి ద్రావిడ, ఆర్య భాషాలు వేగంగా కలిసిపోవటంతో...చాలా పదాలు ఆర్యుల భాషా సమాజాలతో కలిసిపోయాయి. అయితే ఆర్యుల భాషలను ద్రావిడులు కచ్చితత్వంతో నేర్చుకోకపోవటం వల్ల ఈ రోజు చాలా మాండలికాలు ఏర్పడ్డాయి. సో ఇది మన దేశంలో భాషల వెనుక ఉన్న చరిత్ర. ద్రావిడ భాషలకు సంస్కృతం మూలం కాదు. ద్రవిడ భాషలు వాటికవే ప్రత్యేకం అనే విషయం చెప్పటమే ఈ విశ్లేషణ వెనుక ఉద్దేశం.

No comments:

Post a Comment

 మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా...