Wednesday, October 28, 2020

ఆత్రేయపుం పూతరేకులు


ఆత్రేయపురం పూతరేకులు


సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 



పట్టుపరికిణీ మల్లే దండల్లో మురిసి పోతున్నారు అను, రత్న. ఇద్దరూ అక్కచెల్లెళ్ళే కాని ఒకటే హృదయం ఇద్దరిదీ.ఇల్లంతా బందుమిత్రులతో సందడి సందడిగా వుంది. గుమ్మాలకు మామిడితోరణాలు వ్రేలాడుతూ ఉన్నాయి. పెళ్ళి బాజాలు శ్రావ్యంగా మ్రోగుతున్నాయి.

అక్కా చెల్లెళ్ళు  ఒకరిని ఒకరు ఆటపట్టించుకుంటూ ఇంటి ముందర తాటాకు పందిరిలోనికి  ఇంటిగదుల్లోకి ఒకటే పరుగులు. వారు పరిగెడుతుంటే కాళ్ళగజ్జెలు చేసే చప్పుడు పెళ్ళిసందడిని మరింత పెంచుతూవుంది. పెళ్ళి పెద్దలు కిళ్ళీలు నములుతూ అను, రత్నలు చేసే అల్లరికి చిరునవ్వులు చిందిస్తూ కబుర్లాడుకుంటున్నారు. అది అను , రత్నల  పెద్దక్క కనకదుర్గ పెళ్ళి రోజు.చాన్నాళ్ళకు వాళ్ళింటిలో పెళ్ళి జరుగుతుంది. పనులు పురమాయిస్తూ అను ,రత్నల నాన్నగారు శ్రీధర్ హడావిడిగా తిరుగుతున్నారు. "ఏమండోయ్ బావగారు  పెళ్ళి కొడుకుది ఏ ఊరు" అని అడిగాడు పెళ్ళి పెద్దల్లో ఒకరైన గంగాధరం కిళ్ళీ ఊస్తూ. "అబ్బాయిది ఆత్రేయపురం"  అంటూ మరో పనిలో పడ్డాడు పెళ్ళికూతురు తండ్రి శ్రీధర్ . ఆత్రేయపురం అనగానే పెళ్ళి పెద్దల్లో కూర్చున్న ప్రభాకరం అనే ఆయన  "ఒహోహో బలే ఊరు సంబంధం అండి. ఆత్రేయపురం పూత రేకులకు చాలా ప్రసిద్ది" అన్నాడు. "దాని గురించి వివరంగా చెప్పండి" అంటూ మడత కుర్చీలో కూలబడ్డాడు  పెళ్ళి పెద్ద రవిబాబు. పూతరేకుల తయారీ గురించి చెపుతుంటే అను, రత్న పరుగు ఆపి నీలిరంగు కుర్చీల్లో వచ్చి  కూర్చున్నారు. ఇద్దరి బుగ్గలు గిల్లుతూ ఆ పెళ్ళి పెద్ద చెప్పడం మొదలు పెట్టాడు" పూతరేకులు లేనిది పెళ్ళి సారెలు నిండుగా ఉండవు. పూతరేకులు రెండు రకాలు బెల్లం పూతరేకులు, పంచదార పూతరేకులు, చెప్పాలంటే బెల్లంతో చేసినవి బాగుంటాయి. బొండా రకపు బియ్యంను నానబెట్టి రుబ్బుతారు. రుబ్బిన పిండిని నీటిలో కలుపుతారు . నీరులా ఉన్న ఆ బియ్యం నీటిలో ఓ చేతిరుమాలంత వస్త్రం ముంచి  ప్రత్యేకమైన మట్టితో తయారుచేసిన కుండపై పూతలా పూస్తారు. ఈ కుండ బోర్లించి ఉంటుంది. ఆ కుండ మూతి వద్ద రధ్రం ఉంటుంది. ఆ రధ్రం నుండి కొబ్బరాకులతో అతి చిన్న మంటను పెట్టి కుండను వేడిచేస్తారు. పూతలా పూసిన బియ్యం నీరు కొద్ది క్షణాలలోనే రేకులుగా తయారవుతుందన్నమాట". అని చెపుతుంటే  రఘురాం అనే ఆయన అందుకుంటూ" ఏమండీ ఇది ఏదైనా పెద్ద పరిశ్రమంటారా? " అని అడిగాడు సందేహంగా. "అబ్బే అదేం లేదండి ఇది కుటీర పరిశ్రమే. దాదాపు మూడు వందల కుటుంబాలు తయారీలో ఉంటాయి" అన్నాడు ప్రభాకరం"బాబాయ్ మరి పూతరేకులు తీయగా ఉంటాయి కదా!" అడిగింది అను. నెయ్యి వాసన కూడా వస్తుంది " అంది రత్న  త్వరగా చెప్పమని అక్కచెల్లెళ్ళు ఇద్దరూ తొందర చేయసాగారు. " ఆగండి ఆగండర్రా చెపుతున్నాను. పూతరేకులు తయారైన తరువాత రేకులు చుట్టండం మరొకరు చేస్తారు". " ఏంటి బాబాయ్  రేకులు చేసినవారు చూట్టరా ? ఆశ్చర్యపోతూ అడిగింది రత్న . "ఆహ లేదమ్మా పూతరేకులు ఒకరు చేస్తే చుట్టడం మరొకరు చేస్తారు. ఎక్కువగా మహిళలు పూతరేకులు చేస్తే చుట్టడం ఎక్కువగా మగవారు చేస్తుంటారు"." బాబాయ్  పూతరేకులు ఎలా చుడతారు?" అడిగింది అను.

"పూతరేకు తీసుకుని అందులో గుమగుమలాడే వేడి నెయ్యిని పూస్తారు ఆ తరువాత బాదం, జీడిపప్పు, బెల్లం పౌడరు జల్లి రెండు అంచులు దగ్గర చేసి మడతపెడతారు . ఈ పనిలో కుటుంబంలో ప్రతీ ఒక్కరూ పాలుపంచుకుంటారు.ఇలా రోజుకు వెయ్యి నుండి రెండువేల పూతరేకులు వరకూ ఒకో కుటుంబం తయారు చేస్తుంది. పది పది చొప్పున చక్కటి అట్టపెట్టెల్లో పేర్చి దేశ విదేశాలకు పంపిస్తూ ఉంటారు. ప్రభుత్వం ఆత్రేయపురం పూతరేకుల తయారీని ప్రొత్సహిస్తూ ఋణాలను మంజూరు చేస్తుంది కూడా". "బలే ఉంది బాబాయ్ తయారీ విధానం" అన్నారు అక్కాచెల్లెళ్ళు ఇద్దరూ . ఇలా వీరు మాట్లాడుతుండగా లోపలనుండి అను, రత్నల  అమ్మ నీరజ పూతరేకులు పళ్ళెంలో పట్టుకు వచ్చి పందిరిలోని పెద్దలందరికీ పంచి పెట్టింది. అను, రత్నలు గబ గబా తిని " అబ్బా నోటిలో పెట్టుకోగానే ఉత్తినే కరిగిపోతున్నాయ్ " అనగానే పందిరిలో  ఉన్న పెద్దలందరూ పకపకా నవ్వేశారు.


సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 



పొట్టిక్కలు

 


పొట్టిక్కలు


సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 


 కపిలేశ్వరం జంమిందారు కోట చామంతి పూల దండలతో కళకళలాడుతుంది. దసరా పండగ బలే చేస్తారు జమిందారుగారు. కోటలో విందు  జరిగే పందిరి కిటకిటలాడుతుంది. ఫలాహారల సమయం కావడంతో వంటవాళ్ళు వంటలన్నీ వరుసగా పేరుస్తున్నారు. పొట్టిక్కలు, ఇడ్లీలు,మినప గారెలు, పెసరెట్టు, పూరీలు,ఊతప్పాలు, పాయసం,అన్నీ ఉన్నాయి అక్కడ.విందుకు వచ్చిన వారందరూ పొట్టిక్కలను లొట్టలేసుకు తినడంతో ప్రక్కనే ఉన్న ఇడ్లీకి ముఖం మాడిపోయింది.

ఉండబట్టలేక పొట్టిక్కలను సూటిపోటి మాటలతో హేళన చేస్తూ "ఏంటమ్మా పొట్టిక్క పెద్ద ఫోజు కొడుతున్నావ్ నేను ఇడ్లీని తెలుసా. మా పుట్టిల్లు చెన్నై నగరం. సాంబారుతో నన్ను తింటే ఆహా ఓహొ అంటారు అందరూ. కాస్త కారం పొడి నెయ్యి తగించి మరి తింటే ఉంటుందీ ఆ మజాయే వేరు తెలుసా "అంది. పొట్టిక్క చాలా మంచిది. నెమ్మదస్తురాలు. పొట్టిక్క సాంబారు ఇడ్లీతో " సోదరా ఇడ్లీ నన్ను కూడా పొట్టిక్క ఇడ్లీ అనే పిలుస్తారు. మాది కేరళ రాష్ట్రం. కోనసీమ వాసులు కొబ్బరి కాయల వ్యాపారం కోసం నిత్యం మా ప్రాంతానికి వస్తూ పోతూ ఉండటంతో మీ ఆంధ్రాకు కూడా పరిచయమయ్యాను. రావులపాలెం, అంబాజీపేట వాసులు అక్కున చేర్చుకున్నారు. నన్నూ నీలాగే మినపపిండి, ఇడ్లీరవ్వతో చేస్తారు. అయితే ఉత్తి ఆవిరి పట్టరు అదే నా ప్రత్యేకత. నన్ను నాలుగు పసన ఆకులతో చేసిన బుట్టలో వండుతారు. ఆ ఆకులలో వండటం వలన నాకు మంచి రుచి వస్తుంది. నన్ను బొంబాయి చట్నీతో కలిపి తింటే చెప్పానని కాదుకాని మరలా మరలా వడ్డించుకు తింటారు  నువ్వు ఏం కుళ్ళుకోకులే  మనం ఇద్దరం సోదరులమే అంది పొట్టిక్క". 

"బలే బలే ఎంత బాగా మాట్లాడుతున్నావో  

నువ్వు నా లాగే మంచి పేరు తెచ్చుకో  పొట్టిక్క" అంటూ మెచ్చుకుంది ఇడ్లీ.


సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 


 

యానాం కాథలిక్ చర్చి

    యానాం కేథలిక్ చర్చి




సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 



ఆ రోజు1996  నవంబరు 6.పాండిచ్చేరి శాసనసభ సమావేశాల్లో తీరికలేకుండా ఉన్న యానాం శాసనసభ్యులు మల్లాడి కృష్ణారావుగారు పదే పదే మ్రోగుతున్న ఫోను అందుకున్నారు. అవతల నుండి వచ్చిన సమాచారం తీవ్ర ఆవేదన కలిగించింది. హుటాహుటిన హెలీకాప్టరులో యానాం బయలుదేరారు.యానాం సెయింట్ ఆన్స్ రోమన్ కేథలిక్ చర్చి ఫాదర్ జోసఫ్ అనితోథన్ ఓ ప్రక్క చర్చి ఆవరణలోని తన గదిలో గాబరాగా పచార్లు చేస్తున్నారు. ఆయన మనస్సు ఆవేదనతో నిండిపోయి వుంది. బంగాళాఖాతంలో వచ్చిన తీవ్ర తుఫాను యానాం పరిసరప్రాంతాలకు తీవ్ర నష్టం చేకూర్చింది.యానాం చర్చి ఆవరణలో ఫాదర్ గాంగ్ లోఫ్ పెంచిన  బొటానికల్ గార్డెన్ తుడిచిపెట్టుకుపోయింది.ఎంతో కాలంగా కాకినాడ పరిసరప్రాంత విద్యార్ధులకు విజ్ఞానాన్ని అందించిన గార్డెన్ తన హయాంలోనే కనుమరుగవ్వండం ఫాదర్ అనిథోతన్ తట్టుకోలేకపోతున్నారు. తుఫాను చేసిన నష్టం విని చర్చిని చూడడానికి ఎమ్మెల్యే కృష్ణారావుగారు వస్తూండటంతో ఇంకా కంగారుగా ఉంది.ఆలోచనలలోంచి బయటకు రాకుండానే ఎమ్మెల్యేగారు ఫాదర్ ఎదురుగా వచ్చి కూర్చున్నారు. 

 జరిగిన నష్టం వేదన కలిగించడంతో ఇద్దరూ చాలా సేపు మాట్లాడుకోలేదు. కొంతసేపటికి కృష్ణారావుగారే మాట్లాడుతూ "ఫాదర్ ఈ ఉధ్యానవనంతో నాకు చాలా అనుభందం ఉంది బడి గంట కొట్టగానే పిల్లలందరం పరుగు పరుగున చర్చి దగ్గరకు వచ్చేవారం ఇక్కడ ఫాదర్ గాంగ్ లోఫ్ పిల్లలకు పాలు, పళ్ళు, బిస్కట్లు పంచేవారు  అవి తిని అందరం చీకటి పడేవరకూ ఆడుకుని ఇంటికి వెళ్ళేవారం. అవి ఇక గురుతులుగానే ఉండిపోతాయి." ఎమ్మేల్యే గారి గొంతులో జీర కనపడింది.

ఫాదర్ ఎమ్మేల్యే గారి ఆవేదనను గమనించి మాట మారుస్తూ " సార్ యానాం చర్చి మన దేశంలోని  పురాతనమైన చర్చిల్లో ఇదీ ఒకటి. నీలిమందు వ్యాపారం కోసం వచ్చిన ఫ్రెంచివారు వారి ప్రార్దనలకోసం 1768 నిర్మించారు. అయితే తుఫానుకు చర్చి దెబ్బతినడం ఇదే మొదటిసారి కాదు 1787 లో ఒకసారి కూలిపోయింది. చర్చి నిర్మాణం తిరిగి1835 లో ప్రారంబమై 1846 లో పూర్తయ్యింది. అప్పటి నుండి ఈ తుఫాను వరకూ ఏ నష్టం జరుగలేదు ఇప్పుడు ఇలా జరగడం బాధిస్తుంది.

 ఎమ్మేల్యే కృష్ణారావుగారు మాట్లాడుతూ "  ఫాదర్ ఈ చర్చి మా యానాం పట్టణానికి తలమానికం.  రోమన్ గోథిక్ శైలిలో నిర్మించారు. పర్నీచరు అంతా రంగూన్ టేకుతో చేయబడింది.అందమైన గాజుదీపాలు,అద్దాలు, గంటలు,పూజా సామాగ్రి అంతా ఫ్రాన్సు దేశం నుండే వచ్చింది.ఇది ఓ  చారిత్రక చిహ్నం."

" అవునండి, చర్చి గోపురంలో అమర్చిన గడియారం మరీ ప్రత్యేక మైనది. చర్చికి దూరప్రాంతం నుండి వచ్చేవారు  ఆలయంలోని గోడల పై చుట్టు ఉన్న ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన క్రీస్తు జీవిత విశేషాల చిత్తరువులు చూస్తూ ఎంత ఆనందిస్తారో "అన్నారు ఫాదర్ .

వాచ్ మన్ తెచ్చిన పొగలు కక్కే టీ కప్పును అందుకుంటూ "నిజంగా ఫాదర్. మనదేశంలో అయితే పుదుచ్చేరి, కారైకల్ ,మాహెలలో కూడా ఇటువంటి నిర్మాణాలున్నాయి. ఫ్రాన్సు దేశంలో ఎక్కువగా ఇటువంటివి కనిపిస్తాయి" అన్నారు ఎమ్మేల్యేగారు. 

 ఫాదర్ అనిథోతన్ కూడా తేనీటిని త్రాగుతూ

"ఈ చర్చి ఆవరణలో ఉన్న లుర్దూ మాతను విశ్వాసులు దర్శించండం ఇటీవల పెరిగింది సార్ "

"అవును ఫాదర్ ఆసంఘటనను మా తాతగారు చెపుతుంటే వినేవాడిని 1943 లో విలియమ్ బి ఒడెన్ అనే పది టన్నుల ఓడ సాక్రమౌంట్ లైట్ హౌస్ దగ్గర యానాం సముద్రం మధ్య ఇసుకలో కూరుకుపోతే ఓడను బయటకు తీయడానికి అమెరికా నుండి వచ్చిన ఇంజనీర్ స్వీని సాధ్యంకాక మేరీమాత పై భారం వేసి ప్రార్దన చేయగా ఓడ అతి సులువుగా కదిలి అందరినీ ఆశ్చర్య పరచిందని "

"అవుసార్ మనం చూస్తున్న రాక్ టెంపుల్  ఆయన భార్య అల్బెర్టా స్వీని దానికి గుర్తుగానే నిర్మించారు. దక్షిణంవైపు  ఉన్న మేరీమాత విగ్రహం మంగుళూరు నుండి రప్పించారండి".

ఫాదర్  స్వరం తగ్గించి "సార్  పురావస్తు శాఖ వారు చర్చికి నిధులు మంజూరు చేస్తారని చెప్పారు పనేమైనా ముందుకు వెళుతుందంటారా సార్ "అని అడిగారు.

మాటలపనిలోపడి అసలు విషయం చెప్పడం మరచిపోయాను పురావస్తుశాఖ నుండి నిధులు మంజూరైయ్యాయి త్వరలోనే ఆలయ పునరుద్దరణ పనులు ప్రారంభమవుతాయి అందుకే కాంట్రాక్టరు డేవిడ్ రాజుకు కబురు పంపాను వస్తూ ఉండవచ్చు"

 అని చెప్పేలోగా మోటారుబైకు ఆపి కాంట్రక్టరు పావులూరి డేవిడ్ రాజు లోపలికి వస్తూ ఎమ్మేల్యేగారికి ఫాదర్ కు నమస్కారం చేసి కూర్చున్నాడు.

ఎమ్మేల్యేగారు రాజు వైపు తిరిగి "రాజు చర్చికి నిధులు మంజూరైయ్యాయి పునరుద్దరణ బాధ్యతలు నీకు అప్పగిస్తున్నాను. యానాం కేథలిక్ చర్చి పురాతన స్వరూపం మారకుండా మరో రెండువందలయేళ్ళు చెక్కుచెదరకుండా ఉండేలా నిర్మాణం చేయాలి" అని నిధుల మంజూరు ఉత్తర్వులు రాజు చేతిలో పెట్టారు ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావుగారు.

ఉత్వర్వులు తీసుకున్న రాజు "మేరీమాతకు సేవ చేసే భాగ్యం దొరికిందనుకుంటానండి  మరలా మార్చి నెలలో జరిగే లుర్దూమాత ఉత్సవాలకు సిద్దం చేస్తాను సార్ "అని వినయంగా చెప్పాడు ఎమ్మేల్యే గారికి.

 ఫాదర్ నవ్వుతూ భక్తిభావంతో కనులు మూసి "ఆమెన్ "  అంటూ పైకి లేచారు .



సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 




కొండెవరం యుద్దం

 


             కొండెవరం యుద్దం


సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 



శ్రీరామనవమి ఉత్సవాలు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి దగ్గరగా ఉన్న కొండెవరంలో బాగా జరుపుతారు. ఈ ఉత్సవాలకు పేరు పొందిన కళాకారులను రప్పిస్తూ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తుంటారు. జానపదకళారూపాలు కనీసం ఓ నాలుగురోజులైనా ప్రదర్శిస్తారు. అందులో తప్పెటగుళ్ళు, కోలాటం, డప్పు వాయిద్యం, బుర్రకథ,హరికథ తప్పక ఉంటాయి. ఆ యేడు ఘనంగా  నవమి వేడుకలు నిర్వహించాలని ఆలయ కమిటీ 

మీటింగు పెట్టుకుని మాట్లాడుకుంటూ ఉంది. గ్రామ సర్పంచ్ సుబ్రహ్మణ్యం ఆలయ ధర్మకర్త .ఆయన అధ్యక్షతనే సభ జరుగుతుంది. "భక్తులారా! చుట్టుప్రక్కల ఊళ్ళలో మన ఊరి శ్రీరామనవమి ఉత్సవాలకు ఉన్న మంచి పేరు మీ అందరికీ తెలుసు. ఆ పేరును మరింత పెంచేలా ఈ యేడు  వేడుకలు నిర్వహించాలి. అందుకు ఎలాంటి కార్యక్రమాలు ఉండాలో సూచించండి" అని కూర్చున్నారు. కమిటీ సభ్యుల్లో సత్యనారాయణ లేచినిలబడి అయ్యా మన ఊరి చరిత్ర 300  ఏళ్ళ క్రితం నాటిది. కొండెవరం యుద్దం లేదా చెందుర్తి యుద్దం లేదా చందవోలు యుద్దంగా పిలుస్తారు. ఆనాటి కథను మనకు కళ్ళకు కట్టినట్లు చెప్పగలిగే వాళ్ళు ఒకరున్నారు వారిని పిలిపిద్దాం అన్నాడు. సభలో ఒకటే అలజడి "ఈ చరిత్ర ఎవరికీ తెలియదు తప్పకుండా పిలిపించండి" అని సభ్యులు గోలచేయసాగారు. "ఆగండి ఆగండి,  గోల చేయడం సభా మర్యాదకాదు నిశ్శబ్దం పాటించాలి " అని  అధ్యక్షుడు గదమాయించి  "సత్యనారాయణ గారు మీరు చెప్పింది బాగుంది వివరాలు చెప్పండి" అన్నారు . సత్యనారాయణ మాట్లాడుతూ "జముకుల కథ చెప్పే వారు ఉన్నారండి వారు కొండెవరం యుద్దం కథాగానం చేస్తారు. మన ఊరి కథను మనవారికి తెలియజేద్దాం" అని ముగించి కూర్చున్నాడు సత్యనారాయణ. "తప్పకుండా జముకుల కథ ఉంటుంది. నవమి మొదటిరోజే ఏర్పాటు చేద్దాం" అని సభ ముగించారు. ఈవిషయం బడిలోని సోషలు మాస్టారు కామేశ్వరరావుగారికి తెలిసింది. ఆయన పిల్లలను ఉద్దేశించి చెపుతూ పిల్లలూ" మీకు నేనిచ్చే ప్రాజెక్టువర్కు ఏంటో తెలుసా?"  "చెప్పండి సార్" పిల్లలు ఒకటే అరుపులు బల్లలపై దరువులు. ఏమిటంటే నవమికి జముకులవారు చెప్పే మన కొండెవరం యుద్దం చరిత్రగానాన్ని విని చక్కగా కథలా రాసి చూపించాలి. అదే ఈ నెల ప్రాజెక్టువర్కు " అని చెప్పగానే  "ఒకే సార్ " అంటూ పిల్లలు బల్లలు చరచసాగారు. 

నవమి కార్యక్రమాలలో  ఆ యేడు జముకుల కథ హైలెట్ అయ్యింది.

పిల్లలు ఆలకించి వీరావేశం పొందారు. ఇంటికి పోయి ప్రాజెక్టువర్కు పూర్తిచేసారు. బడిలొ మాస్టారుకు చూపించారు. సోషలు మాస్టారు  విద్యార్ది రమణ రాసిన ప్రాజెక్టు వర్కును ఎంపిక చేసి తరగతిలో ఇలా చదవడం ప్రారంబించారు.

"అది 1758 సెప్టెంబరు నెల బుస్సీ అధికారంలోని  ఫ్రెంచివారు విజయనగరం రాజులను ఇబ్బందులు పాలుజేస్తున్నారు. యుద్దానికి సై అంటున్నారు. బలహీనుడైన విజయనగరం ఆనందగజపతిరాజు బ్రిటీష్ వారి సహాయం కోరక తప్పలేదు .బ్రిటీష్ గవర్నర్ జనరల్ రాబర్ట్ క్లైవ్ కొంతమంది సైనికులను రాబర్ట్ ఫోర్డ్ కు ఇచ్చి యుద్దానికి పంపాడు. ఫ్రెంచివారిని తరిమి కోస్తా ఆంధ్రాపై ఎప్పటినుండో పట్టుసాదిద్దామనుకుంటున్న బ్రిటీష్ సైన్యానికి ఆనందగజపతిరాజు ఆహ్వనం కోతికి కొబ్బరికాయ దొరికినట్లయ్యింది. 


కొండెవరం నుండి చెందుర్తి వరకూ దీనినే ఒకప్పుడు చందవోలు అని పిలిచేవారు ఈ ప్రాంతమంతా ఘోరమైన యుద్దం జరిగింది. ఫ్రెంచివారు ఓడిపోతున్న సమయంలో  ఆనందగజపతిరాజు నుండి, బ్రిటీష్ సేనలనుండి ప్రమాదాన్ని పసిగట్టిన పెద్దాపురం వత్సవాయి గజపతిరాజు ఫ్రెంచివారికి సహయం చేయడానికి ముందుకు వచ్చాడు. ఈ యుద్దం విజయనగరం రాజులు, బ్రిటీష్ వారు ఓ ప్రక్క మరియు పెద్దాపురం రాజులు ఫ్రెంచివారు ఓ ప్రక్క ఉండి చేసిన యుద్దం అన్నమాట. బ్రిటీష్ వారు నైజాం రాజులతో సంధి కుదుర్చుకోవడంతో  విజయనగరం ఆనందగజపతరాజు ఓడిపోయాడు. ఇది భారతదేశంలో జరిగిన అతి నిర్ణయాత్మక యుద్దంగా గుర్తించబడింది. అని  మాస్టారు చదవడం ముగించారు. చక్కగా వివరంగా రాసిన రమణను విద్యార్దులు చప్పట్లతో అభినందించారు.


సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 




జాంథానీ

       

           ఉప్పాడ జాంథానీ చీరలు


సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 



       తూర్పుగోదావరి జిల్లా కాకినాడ బీచ్ మీదుగా ఎర్రటి మారుతి కారు ఉప్పాడ గ్రామానికి పరుగులు పెడుతుంది. బీచ్ రోడ్డు పైకి దూసుకు వచ్చే కెరటాలకు ఓ ప్రక్క భయం మరో ప్రక్క ఆనందంగా ఉంది. కారులో ప్రయాణిస్తున్న కృష్ణకు ,లక్ష్మికి విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. ఇద్దరూ అన్నా చెల్లెళ్ళు .ఇద్దరూ కవలపిల్లలు కూడా కావడంతో ఒకే తరగతి చదువుతున్నారు.లక్ష్మి ఆలోచనలన్నీ చీరల చుట్టూ తిరుగుతున్నాయి. ఎనిమిదవ తరగతి ఆంగ్లపాఠం "ద స్టొరీ ఆఫ్ ఐకత్" చెప్పేప్పుడు విన్నాను ఉప్పాడ జాంథానీ చీరల గురించి, అదే ఆలోచిస్తుంటే సముద్రపు కెరటం ఒకటి కారు అద్దాలను దబ్బున తాకింది. లక్ష్మి కెవ్వున కేక పెట్టి సీటులో కూలబడింది . తల్లి దుర్గావతి వాట్స్ యాప్ చాటింగ్ లోంచి బయటకు వస్తూ ఇద్దరినీ గోలచేయకుండా కూర్చోమని కసిరింది. తండ్రి గంగాధర్ డ్రైవింగ్ చేస్తూ ఎత్తు బ్రిడ్జి దగ్గర కొంతసేపు ఆపి సముద్రం అందాలు చూపించాడు. రాళ్ళ మధ్య నిలబడి సముద్రపు అలలు కనిపించేలా ఫోటోలు తీసుకున్నాం. మరలా ఉప్పాడ వైపు పోనిచ్చాడు కారుని నాన్న. కాకినాడకు  ఉప్పాడకు మధ్య దూరం 20 కి.మీ .



     కృష్ణకు అంత ఆసక్తి లేదుగాని లక్ష్మికి మాత్రం జాంథానీ చీరల తయారీ ఎప్పుడు ఎప్పుడు చూసేద్దామా అని ఉంది. తల్లి దుర్గావతి నాన్నను జాంథానీ చీర ఎప్పుడు కొంటారని పోరుపెట్టడం రోజూ చూస్తునే ఉంది. ఆ చీర చాలా ఖరీదని అమ్మ ఎవరితోనో చెబుతుంటే విన్నది లక్ష్మి. ఒక్కో చీర ఐదువేల నుండి లక్షవరకూ కూడా ఉంటుందని చెప్పడం ఆశ్చర్యమనిపించింది. ఉప్పాడ గ్రామంలోకి ప్రవేశించే సరికి బీచ్ రోడ్డు సెంటరు కనిపించింది. మలుపు తిరిగి పిఠాపురం రోడ్డుకు టర్న్ తీసుకుంది కారు. ఉప్పాడ కొత్తపల్లి జంటగ్రామాలు రెండు గ్రామాలలో చీరలు నేస్తారు కాని ఉప్పాడ చీరలుగానే ప్రసిద్ది. "పూర్వం జైపూర్ మహారాణి ఉప్పాడను ఆనుకుని ఉన్న అమీనాబాదలో వీరరాఘవులు అనే చేనేత కార్మికుడితో చీరలు నేయించుకునేవారట అందుకే ఇది గొప్పవారి చీరగా బావించి ఎవరూ ఆసక్తి చూపేవారు కాదు. కాని ఇటీవల దేశవ్యాప్తంగా బాగా పేరుపడింది." కారు నడుపుతూ చెపుతున్నాడు నాన్న. ఉప్పాడ సినిమా సెంటరుకు వచ్చేసరికి ఎక్కడ చూసినా  చీరల షాపులే. ప్రతీ ఇల్లు ఓ బట్టల దుకాణమే . అందుకే అన్నట్టున్నారు చేనేతను కుటీర పరిశ్రమ అని. కారు ఆపితే అందరం దిగాం నాన్న ఎవరికో ఫోను చేస్తే వచ్చి చీరల షాపులకు తీసుకువెళ్ళారు.అమ్మ అతనితో ఒకసారి చీర ఎలా నేస్తారో చూపించమని అడిగింది. అలాగేనంటూ అతను తలాడించి చీరలు నేచే ఇళ్ళకు తీసుకు వెళ్ళాడు. అక్కడ అమ్మాయిలు చీర నేయడం కనిపించింది. ఓ ప్రక్క కుర్చీలో సేదతీరుతున్న మాస్టర్ వీవరు దగ్గర ఉండి నేయిస్తున్నాడు. చీరకు కావలసిన ముడి సరకునంతా ఇతనే సమకూరుస్తాడు. మా అందరికీ కుర్చీలు వేయించాడు. అక్కడే తిరుగుతున్న ఓ అమ్మాయికి చెవిలో ఏదో చెపితే  అది విని అమ్మాయి హడావిడిగా బయటకు పరిగెత్తింది.

"సార్ చీరలు కొనుగోలుకు వచ్చాం కాని కొనేముందు జాంథానీ చీరల తయారీ దాని విశిష్ఠత తెలుసుకోవాలనుకుంటున్నాం"  అన్నాడు నాన్న మాట కల్పించుకుంటూ . "తప్పకుండా జాంథానీ చీర పుట్టింది బంగ్లాదేశ్ దేశంలో. "జాం "అంటే పూలు "థానీ" అంటే గుత్తి అంటే పూలగుత్తి" అంటుంటే నేను" ప్లవర్ బోకే అన్నమాట " అన్నాను. ఆయన నవ్వేస్తూ "అంతేనమ్మా చీరను చేతిలోనికి తీసుకుంటే ఆ బావన కలుగుతుంది కాబట్టే ఆ పేరు వచ్చింది,  ఏం చదువుతున్నావ్ ?" అని అడిగారు నన్ను మురిపెంగా చూస్తూ మాస్టర్ వీవర్ ." ఎనిదవ తరగతి అండి " అని బదులిచ్చాను. అమ్మ మధ్యలో మాట్లాడకు చెప్పనీ" అంది విసుగు ప్రదర్శిస్తూ. "పరవాలేదండి పిల్లలు ప్రశ్నలు వేస్తూ సందేహాలు తీర్చుకోవాలి." అన్నాడు మాస్టర్ వీవరు. 

       "అతి సున్నితమైన దారపు నూలుపోగులను సన్నని చేతివేళ్ళు కలిగిన చిన్నవయస్సు వారే నేస్తారు. దీనిని పెద్ద వయస్సు వారు నేయలేరు"  అన్నాడు మాస్టరు వీవరు అన్నయ్య నేను ముఖముఖాలు చూసుకున్నాం.  "ఎందుకని ? అడిగాను ఆశ్చర్యం ప్రదర్శిస్తూ. "ఎందుకంటే జాంథానీ దారపు పోగులు అతి సన్నగా సుతి మెత్తగా ఉంటాయి పెద్దవారి చేతులకు దారాలు తెగిపోతాయి అందుకని చిన్నవయస్సు వారే నేస్తారు." చెప్పాడు మాస్టర్ వీవరు. అన్నయ్య కృష్ణ "చీరలు నేచే వాళ్ళను ఏమంటారు? అని అడిగాడు."మగ్గం నేతగాళ్ళు లేదా నేతగాళ్ళు"  అంటారు." "జాంథానీ చీరలు యంత్రాలమీద నేస్తారండీ ?" అని అడిగాడు నాన్న.

"లేదండి పూర్తిగా చేనేత మగ్గం మీదే నేస్తారు. వెండి జరీతో నేయడం వల్ల దీని ఖరీదు ఎక్కవ  అందుకే దీనికి అంత డిమాండ్ కూడా "

" ఏ రకమైన డిజైన్ల చీరలు పేరు పొందాయంటారు? " అమ్మ అడిగింది. 

" కాటను చీరలు, పట్టుచీరలను మగ్గం పై నేస్తారు. ఇక చీరలలో రకాలంటే పల్లులు, అంచు లతలు, ఆల్ ఓవర్ ఉంటాయి. ఇక డిజైన్లు అయితే మల్లెపందిరి,త్రిశూల, మధులత , బోర్డరు చిలకలు, దండా చిలుకలు, దర్బారు, శ్రీలత  పేరుబడ్డాయి". బయటకు వెళ్ళిన అమ్మాయి గబగబా వస్తూ సర్వింగ్ ప్లేటులో బూందీ, ఉప్పాడ కజ్జికాయ స్వీటు తీసుకువచ్చి అందరికీ ఇచ్చింది. నేను అన్నయ్య ఆత్రంగా తింటుంటే అన్నయ్యకు పొలమారింది. అమ్మ హేండ్ బేగ్ లోనుండి వాటర్ బోటిల్ తీసి తాగిపించింది. 

నాన్న మాస్టరు వీవరుతో "బుటా వర్కు అని విన్నాను. ఏమిటి కాస్త వివరంగా చెప్పండి" అని అడిగాడు. "బుటావర్కునే చుక్కతీయడం అంటారు. చిన్న చిన్న ఆకులు, రెమ్మలు, పువ్వులు డిజైన్లుగా చీరమీద ఖచ్చితమైన దూరం, సైజుతో  చీర మీద చేతితో అల్లుతారు. ఈ బుటా పనితనమే జాంథానీకి ప్రత్యేకత తీసుకువచ్చింది." అని ఒకించిత్ గర్వం తొణికిసలాడే స్వరంతో అన్నాడు మాస్టర్ వీవరు.

      "అమ్మా మగ్గం చూపించమనవే"  అంటూ అడిగాను నేను ఖాళీ చేసిన పేపరు ప్లేటును క్రిందపెడుతూ" నా మాట విని మాస్టర్ వీవర్ "రండి చూపిస్తాను" అంటూ కుర్చీలోంచి పైకి లేచాడు. అందరం అతని వెనుకే అనుసరించాము. ఆయనే మగ్గం పనిని వివరిస్తూ "మగ్గాలు గుంట మగ్గాలు,స్టాండు మగ్గాలుగా అని ఉంటాయి. మగ్గంపై ముగ్గురు పనిచేస్తారు. మధ్యలో కూర్చున్నవారు  చిలక లాగుతూ ,సప్పాలు తొక్కుతూ మగ్గాన్ని ఆడిస్తే అటూ ఇటూ ఉన్నవారు  చుక్కతీస్తుంటారు. 

 ఇదిగో చూడండి  ఈ పొడవాటి దారపు పోగులను పడుగు అంటారు. కోర అనే తెల్లటి దారాలకు రంగులు అద్ది తయారుచేస్తారు. అడ్డంగా అల్లే దారాన్ని  పేక అంటారు."

"మగ్గం టకు టికూ మని శబ్దం వస్తుందేమిటండీ" అమాయకంగా అడిగాడు అన్నయ్య. అందరూ నవ్వేశారు " మగ్గానికి క్రిందనున్న సప్పాలతో తొక్కి మగ్గం పైనున్న చిలుకను లాగినప్పుడు  రెండు వరుసలలో ఉన్న పడుగు క్రిందది పైకి పైది క్రిందకు వెడుతుంది అప్పుడు అడ్డునేత నాడి అనే పరికరంలో బిగించిన దారపుకండె అటూ ఇటూ అల్లుతూ ఉంటుంది . ఆ నాడి చేసే శబ్దమే నువు విన్నది "  అన్నాడు మాస్టర్ వీవరు . నాన్న మధ్యలో మాట్లాడుతు "రాట్నం మీద కండెలు చుడతారు ఇందుకేనేమో "అన్నాడు. "నిజం చెప్పారు కండెలు చుట్టేవారు ప్రత్యేకంగా ఉంటారు. పెళ్ళిళ్ళకు ప్రత్యేక ఆర్డరుపై అతి ఖరీదైన చీరలు నేస్తూ ఉంటాం రాజకీయ ప్రముఖులు, సీనీ తారలు ఎక్కువగా కొనుగోలు చేస్తూ వుంటారు." "నేత పనిలో ఎటువంటి కష్టనష్టాలు ఉన్నాయంటారు ?  అమ్మ అడింగింది మాస్టరు వీవరును. "లేకేం చుక్క తీసేవారికి కంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. గుంట మగ్గాలలో పని చేసేవారికి దోమల ద్వారా బోదకాలు వంటి రోగాలుకు గురవుతున్నారు." అందరం ముఖాలు చూసుకున్నాం ఇక వెడదామన్నట్టు. "నమస్కారమండి చాలా విషయాలు మాకు తెలియజేసారు. మంచి నాణ్యమైనవి ఓ రెండు చీరలు తీసుకుంటాను చూపించండి" అన్నది అమ్మ. "పదండి మా షాపు మా ఇంటి దగ్గరే ఉంది" అంటూ ముందుకు నడిచాడు మాస్టరు వీవరు.


సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 



బషీర్ బీ బీ

 


        బషీర్ బీబీ తీర్ధం( బంగారుపాప)


సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 




    జానకీరాం మాస్టారుకు తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం పొన్నాడ ప్రాథమిక పాఠశాలకు బదిలీ అయ్యింది. పొన్నాడ పేరు చెప్పగానే తోటి ఉపాధ్యాయులు మంచి చరిత్ర ప్రసిద్ది చెందిన ఊరు వెళుతున్నారంటూ అభినందించారు.అక్కడ బషీర్ బీబీ దర్గా ఉందని ,ఉరుస్సు ఉత్సవాలు బాగా నిర్వహిస్తారని ,మతసామరస్యానికి చిహ్నంగా పేరు పొందినదని చెప్పారు. అంతే అంతకు మించి ఎవ్వరూ ఏమీ చెప్పలేదు. బడిలో చేరిన మాస్టారును పలకరించడానికి అందరూ వస్తున్నారు. వచ్చిన వారిని బషీర్ బీబీ దర్గా విశేషాలు అడుగుతున్నారు మాస్టారు . బంగారుపాప అంటారని, బంగారపాపమ్మ తీర్ధమని పిలుస్తారని చెపుతున్నారు. తీర్దం మూడురోజులు జరుగుతుందని దేశ నలుమూలల నుండి ముస్లీం మతస్ధులు  కుటుంబాలతో వస్తారని, చుట్టుప్రక్కల గ్రామాలకు చెందిన హిందూ మతస్ధులు కూడా దర్గాను దర్శించి తమ ఆడబిడ్డలకు పెళ్ళిళ్ళు జరిగితే చీర,రవిక, గాజులు  మొక్కుగా చెల్లించుకుంటారని ఊరిలో పెద్దలు వారికి తెలిసింది చెప్పారు.

 మధ్యహాన్నం భోజనం ముగించి విరామ సమయంలో దర్గా చూడడానికి వెళ్ళారు మాస్టారు. నిర్మానుష్య ప్రాంతంలో పాడుబడిన పురాతన శిధిల భవనంలా కనిపించింది. అది ముస్లీం ప్రార్ధన మందిరంలా అనిపించలేదు. దర్గా పరిసర ప్రాంతాలలో జనసంచారం కనిపించలేదు కాని దర్గా దర్శనానికి వచ్చిన ఓ రెండు మూడు ముస్లీం కుటుంబాలు ప్రక్కనున్న షెడ్ లో వంట చేసుకుంటూ కనబడ్డాయి. దర్గా మధ్యలో ఓ పెద్ద మర్రివృక్షం ఉంది. దానికి చమ్కీవస్త్రాలు  కట్టి ఉన్నాయి. అవి గాలికి అటూ ఇటూ  ఎగురుతూ ఉన్నాయి .చుట్టూ పరిశీలించి వచ్చేశారు జానకీరాం మాస్టారు.

 తరువాత రోజు బడి దగ్గరకు ప్రక్కస్కూల్ ప్రసాదు మాస్టారు వచ్చారు. మాటల సందర్భంలో బంగారుపాప అని ఎందుకు పిలుస్తారో చెప్పారు. పూర్వం ఇక్కడ ఉండే బంగారుపాప అప్పుల బాధలలో ఎవరైనా ఉంటే  అడగగానే తన బంగారునగలు తాకట్టు పెట్టుకోవడానికి ఇచ్చేదని అందుకే అందరూ బంగారు పాప అని పిలిచేవారని ఇప్పటికీ అలాగే పిలుస్తున్నారని జనం నాలుకలమీద నానే కథను చెప్పారు. అయినా జానకీరాం మాస్టారుకు ఆ సమాచారం తృప్తిని ఇవ్వలేదు. దర్గాకు చెందిన విశేషాలు ఇంకా తెలుసుకోవాలని దగ్గరలో ఉన్న మూలపేట గ్రామం వెళ్ళారు.గ్రామంలో చదువుకున్నవారి దగ్గర సమాచారం ఏదైనా దొరుకుతుందేమోనన్న ఆశతో. అక్కడ ఓ బ్రాహ్మణ కుటుంబం కంటబడింది. మాస్టారు వాకబు చేస్తుంటే లోపలనుండి ఒకాయన వచ్చి మా పూర్వీకులు రాసిన పుస్తకం ఒకటుందని 

‌చెప్పి లోపలకు వెళ్ళాడు. మాస్టారుకు !చెప్పలేని ఉత్సుకత ,ఆనందం కలిగింది. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లయ్యింది. లోపలకు వెళ్ళిన ఆయన ఓ చివికిన పుస్తకం తీసుకు వచ్చి చేతికి ఇచ్చాడు. ఆయన చేతిలో ఓ పాతిక రూపాయలు పెట్టి గబగబా వెనక్కి తిరిగి వచ్చేసారు మాస్టారు.

       స్కూల్ అయిన తరువాత ఇంటికి వెళ్ళి భోజనం ముగించి పుస్తకం చదవడం ప్రారంభించారు. అది చారిత్రక నవల.

70  సంవత్సరాల క్రితం రాసిన పుస్తకం.పీఠికలో దర్గా కథను రచయిత కలలో కనబడి బంగారుపాప రాయించుకున్నట్టుగా ఉంది.వేయి సంవత్సరాల క్రితం నాటి మాట. 

పొన్నాడ షెహర్ డిల్లీ పాదుషాల ఏలుబడిలో వుండేది. పొన్నాడ షెహర్ శ్రీకాకుళం వరకు ఏలుబడిలొ వుండేది. పొన్నాడను పరిపాలిస్తున్న వజీర్ స్త్రీలోలుడు. అందమైన యువతులను చెరపట్టి ఢిల్లీ పాదుషాలకు భార్యలుగా పంపేవాడు. శ్రీకాకుళంలో నివశిస్తున్న సుందరి, బీషీర్ బీబీ స్నేహితురాళ్ళు. ఇద్దరూ మంచి సౌందర్యవతులు  .సుందరి హిందూమతానికి చెందిన యువతి. బషీర్ బీబీ ముస్లీం వనిత. బషీర్ బీబీకి ఆనాటికే వివాహమైంది. భర్త ఢిల్లీ  ఫాదుషాల దగ్గర  సైనికదళంలో పనిచేస్తూ ఉండేవాడు.  ఢిల్లీ పాదుషాకు ఇక్కడ బషీర్ బీబీ ,సుందరి అనే అందగత్తెలున్నారని కబురు పెడతాడు వజీర్ .అందులో బషీర్ బీబీ మహా అందగత్తే అని చెపుతాడు. ఢిల్లీ పాదుషా బషీర్ బీబీ కోసం పొన్నాడలో మనోహరమైన 7 అంతస్దుల భవనం నిర్మించమని ఆదేశిస్తాడు.  వజీర్ ఆఘమేఘాల మీద పరిసర ప్రాంతం దుర్గాడ  నుండి నల్లరాళ్ళను తెచ్చి భవంతి నిర్మాణం వెంటనే ప్రారంభిస్తాడు.వజీర్ నుండి తప్పించుకోవడం కోసం పొన్నాడ నగరానికే మారువేషాల్లో వస్తారు స్నేహితురాళ్ళు .పొన్నాడ షెహర్ లో వజీర్  ఆడవారి పట్ల చేస్తున్న  దౌర్జన్యాలపై ప్రజలను చెైతన్య పరుస్తారు. ప్రజలకు అడిగిన వారికి తోచిన సహాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటారు.ఢిల్లీలో ఉన్న బషీర్ బీబీ భర్త అనారోగ్యం పాలవడంతో ఇంటికి ప్రయాణవుతాడు. చివరకు ఇద్దరు స్నేహితురాళ్ళు వజీర్ సైనికులకు దొరికిపోతారు.ఇంతలో బషీర్ బీబీ భర్త పొన్నాడ మీదుగా శ్రీకాకుళం వెడుతూ పొన్నాడలో మరణిస్తాడు. అది తెలిసి సైనికుల నుండి తప్పించుకుని బషీర్ బీబీ తన భర్త శవంతోపాటు ఢిల్లీ  పాధుషా తనకోసం నిర్మించిన భవంతి పైనుండి అడుగుభాగానికి పోయి సజీవసమాధికి సిద్దపడుతుంది. పై అంతస్దుకు చేరుకున్న సుందరి క్రిందకు చూస్తుంది . భర్త శవం ప్రక్కనే ధ్యాన ముద్రలో ఉన్న బషీర్ బీబీ బంగారుకాంతులు ఈనుతూ కనిపిస్తుంది సుందరికి. అప్రయత్నంగా సుందరి " ఓ బషీర్ బీబీ నా బంగారు పాప" అంటూ పిలుస్తుంది. బంగారుపాప కనులు తెరచి "సుందరీ నా ప్రియమైన మిత్రురాలా ఈ చోటును దర్శించి భక్తితో నన్ను "బంగారుపాప" అని ఎవరు పిలుస్తారో వారి కోరికలు నెరవేస్తాను. మన స్నేహనికి గుర్తుగా ఇక్కడ హిందూ ముస్లీంలు అందరూ కలసి తీర్ధం ఆచరిస్తారని అంటూ ధ్యాన ముద్రలోకి తిరిగిపోతూ కనులు మూసేసుకుంటుంది. ఇంతలో ఉప్పాడ సముద్రం ఉప్పొంగి సునామీలా పొన్నాడపై విరుచుకు పడుతుంది. వజీర్ సైన్యం ఇసుకమేటలలో కూరుకుపోయి చనిపోతారు. ఇసుకమేటలలో బంగారుపాప భవనం చివరి అంతస్దు మాత్రమే కనబడుతూ మిగులుతుంది.. ఆనాటినుండి ఆ చివరి అంతస్ధు భాగం  దర్గాగా పూజలందుకుంటూ ఉంది. నవల చదవడం పూర్తి చేసిన జానకీరాం మాస్టారు గుండె నిండా ఊపిరి పీల్చి మంచి చారిత్రక పుస్తకాన్ని చదివానని ఆనందపడుతూ తృప్తి నిండిన మనస్సుతో బంగారుపాప నవలను ప్రక్కన పెట్టి నిద్రకు ఉపక్రమిస్తారు.


సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 



     

మత్స్యకారుల జీవన విధానం

 మత్స్యకారుల జీవనం


సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 



సముద్రతీర ప్రాతం అయిన ఉప్పాడ గ్రామంలో ఓ కుటుంబం నివశిస్తూ ఉండేది. తేజ  ఎనిదవ తరగతి చదువుతున్నాడు.తన తల్లిదండ్రుల పేర్లు దేవయ్య, కటాక్షం. దేవయ్య ఊరిలో మోతుబరి. ఒకరోజు బాగా చీకటి పడింది. ఆకాశం నిండా నల్లటి మేఘాలు కమ్ముకుంటున్నాయి.ఈదురు గాలులు బలంగా వీస్తున్నాయి. రేడియోలో  ప్రకటన వస్తుంది బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది అది మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉంది మత్స్యకారులు ఎవ్వరూ సముద్రం పైకి వేటకు వెళ్ళవద్దని అనౌన్సర్ చదువుతుంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంబం అయ్యింది. అప్పుడే భోజనాలు ముగించి నులకమంచం మీద నడుం వాల్చాడు దేవయ్య . మరో మంచంపై దుప్పటి కప్పుకుని తేజ ఇనప పెట్టె పై పెట్టిన  దీపంబుడ్డి దగ్గరకు వచ్చిన తూనీగతో ఆడుకుంటున్నాడు. కటాక్షం ఇల్లంతా సర్ది తనూ నడుం వాల్చబోయింది. బయట హోరున వర్షం కురుస్తుంది. ఇంతలో వీధి తలుపును ఎవరో తడుతున్నట్టు అనిపించి దేవయ్య దిగ్గున లేచివెళ్ళి వీధి తలుపు గడియ తీసాడు. సుబ్బంపేటలో పేరు మోసిన చేపలవ్యాపారి కాశీబుల్లొడు వర్షానికి బాగా తడిసిపోయి వణుకుతున్నాడు. దేవయ్య కంగారుపడుతూ కాశీబుల్లోడిని లోపలికి ఆహ్వనించి ఒళ్ళు తుడుచుకుని బట్టలు మార్చుకోమని రుమాలు, పంచే ఇచ్చాడు.

కటాక్షం కంగారుపడుతూ కాశీబుల్లోడికి భోజనం ఏర్పాట్లు చేయడానికి వంటగదిలోనికి పరిగెత్తింది.

"దానవాయిపేట నుండి వ్యాపారం నిమిత్తం సవారి బండి మీద వెళ్ళి వస్తుంటే దారిలో వర్షం ఎక్కువైయ్యి మీ ఇంటి దగ్గర ఆగానని" చెపుతున్నాడు కాశీబుల్లోడు.

ఇంతలో పళ్ళెం నిండా వేరుసెనగకాయలు వేపి 

పట్టుకు వచ్చింది కటాక్షం . తేజ గబగబా గుప్పెడు తీసికుని తినసాగాడు. దేవయ్య కాశీబుల్లోడుతో మాటలు కలుపుతూ  

"ఎప్పటినుండో మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను మత్స్యకారుల జీవన విధానం గురించి చెప్పండి కాస్త అన్నాడు దేవయ్య

  "తప్పక చెబుతాను " అంటూ  తలను రూమాలుతో రుద్దుకుంటూ చెప్పడం మొదలెట్టాడు కాశీబుల్లోడు. తేజలో ఆసక్తి పెరిగింది ఏం చెపుతారా అని.

"ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహజసిద్దమైన   పొడవైన సముద్రతీర ప్రాంతం ఉంది. ఇచ్చాపురం మొదలు నెల్లూరు జిల్లా తడ వరకూ ఈ తీరప్రాంతం విస్తరించి ఉంది. ఈ తీరప్రాంతాన్ని ఆనుకుని  మత్స్యకారులు నివసించే వందలాది గ్రామాలు ఉన్నాయి. మన రాష్ట్రంలో  అగ్నికుల క్షత్రియులు వీరినే పల్లీలు అని పిలుస్తారు, వాడబలిజ, జాలరి,గంగపుత్రులు వంటి మత్స్యకార తెగలవారు నివసిస్తూ ఉన్నారు."

"వీరి జనాభా ఎంత ఉంటుందంటారు ?"

అడిగాడు దేవయ్య

"వీరి జనాభా సంఖ్య దాదాపు 60 లక్షలువరకూ ఉండవచ్చు.వీరు మొదటిలో వ్యవసాయం చేసినప్పటికి  ఆ తరువాత కాలంలో చేపలు పట్టే వృత్తిని స్వీకరించారు.కొంత మంది ఇప్పటికీ వ్యవసాయం చేస్తున్నారు .ప్రధానంగా చేపలవేట మీదే వీరు జీవిస్తూ ఉన్నారు. సముద్రం,నదులు,కాలువలు,చెరువులు, కుంటలలో వీరు చేపలను పట్టి అమ్ముతూ జీవిస్తారు. "

"పురాణాలలో వీరి గురించి ప్రస్తావన ఏముంది?"  అడిగాడు దేవయ్య

" మహాభారత పురాణ హితిహాసాలకాలం నుండి వీరి మనుగడ ప్రస్తావన ఉంది.వీరిని గంగపుత్రులు అనికూడా పిలుస్తారు. వీరి ప్రధాన ఆధాయ వనరు సముద్రపువేట."

"మరి కుటుంబ జీవనం ఎలా వుంటుంది" అని అడిగాడు దేవయ్య.

‌  "మత్స్యకారులది ఎక్కువగా ఉమ్మడి కుంటుంబ వ్యవస్ద. ఇప్పటికీ వీరిలో కులకట్టుబాట్లు అధికం. కుటుంబంలోని మగవారు ఆడపిల్లల బాధ్యతను చేపడతారు వీలు కుదరకపోతే గ్రామంలోని అన్ని కుటుంబాలు బాధ్యతను పంచుకునే అపురూపమైన సమిష్టి జీవనవిధానం ఇంకా వీరిలో అమలవుతూ ఉండటం ఆశ్చర్యం అభినందనీయం."

"నిజమేనండి ఎంత మంచి కట్టుబాటు" 

ఆశ్చర్యంతో కూడిన ఆనందం వ్యక్తం చేసాడు దేవయ్య 

కాశీబుల్లోడు చెపుతూ"ఒక కుటుంబంలోని మగవారు అందరూ చేపలవేటకు వెళతారు తెచ్చిన చేపలను ఆడవారు బజారుకు పట్టుకు వెళ్ళి అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తారు."


"అంకుల్  చేపలవేటకు ఏం ఉపయోగిస్తారు?" ఆసక్తిగా అడిగాడు తేజ


‌ "చేపలవేటకు వీరు వలలను ఉపయోగిస్తారు. కుంటలలో చేపలు పట్టడానికి చేతులు ఉపయోగిస్తారు. దీనిని "తడుముకోవడం" అంటారు.చెరువులలో "కొంటె వల"ద్వారా చేపలు పడతారు. నదులలోను, సముద్రపు ఉప్పుటేరులలోనూ మూడు కర్ర దుంగలను ఒకటిగా కట్టిన "తెప్ప పడవ" వాడతారు."మోచేతి వల"ద్వారా పట్టిన చేపలను తాటాకుతో చేసిన "బుంగ"లో వేసుకుంటారు."

"ఇంకే ఉపయోగిస్తారు"  అడిగాడు దేవయ్య

‌     కాశీబుల్లోడు  చేతిలోని వేరుసేనగకాయ పగులకొట్టి పల్లీ వలిసి నోటిలో వేసుకుని నమూలుతూ   "పడవ,బోటు, మరబోటులను సముద్రపు వేటకు ఉపయోగిస్తారు. పడవ ముందుకు వెళ్ళడానికి నీటిని వెనక్కి నెట్టే తెడ్డులను ఉపయోగిస్తారు.సముద్రపువేటలో సూదూరం ప్రయాణిస్తారు. దాదాపు పక్షం రోజులు వరకూ సముద్రంమీదే వేట కొనసాగిస్తారు మత్స్యకారులు."

"వలలు ఎలా తయారవుతాయి చెప్పండి కాశీబుల్లోడు గారు" అడిగాడు దేవయ్య


"పూర్వం వలలను మత్స్యకారులే తయారుచేసుకునేవారు. నూలుదారాలను "వగ్గావు" అనే ప్రత్యేక సాధనంతో నులిపెడతారు. నూలు దారం తయారైనాక ఆడవారు వలలను అల్లుతారు. వలల అల్లికల మధ్య ఖాళీని" పేతు" అని పిలుస్తారు. ఈ పేతు అంగుళం రెండగుళాలు సైజులతో ఉంటాయి.


"అలా ఎందుకు సైజులుగా ఉంటాయి అంకుల్ " అడిగాడు తేజ 

కాశీబుల్లోడు నవ్వుతూ  "మంచి ప్రశ్న. ఈ పేతు సైజును బట్టే రకరకాల చేపలు వలలో పడతాయి. 

త్వరత్వరగా వంట సిద్దం చేస్తున్న కటాక్షం అన్నీ వింటుంది వంటగది గుమ్మం దగ్గర నిలబడి అన్నయ్యగారు జిగురు వాడతారనుకుంటాను"  అని అడిగింది

 కాశీబుల్లోడు నవ్వుకుంటూ "ఎంతైనా మా ఉప్పాడ అమ్మాయి కదా కొంతైనా తెలియకుండా ఉంటుందా !" అంటూ చెప్పడం ప్రారంబించాడు

"తయారైన వల మన్నిక కోసం తుమ్మ చెక్క తుమ్మజిగురును గూనల్లో పోసి వేడిచేస్తారు.గోరువెచ్చని రంగులో వలను నానబెట్టి ఎండబెడతారు . దానితో వలకు పటుత్వం వస్తుంది.

" త్వరగా వండు కటాక్షం కాశీబుల్లోడు గారు ఎప్పుడు తిన్నారో ఏంటో ఏం కూర చేస్తూన్నావ్ అని అడిగాడు దేవయ్య 

"నాటుకోడి గ్రుడ్లు, ఉల్లి తురుము అండి" అంటూ కూర కలపడానికి వెళ్ళింది కటాక్షం. మరలా సంభాషణలోనికి వస్తూ 

"బుల్లొడు గారు అలివి గురించి చెప్పండి కాస్త"

అడిగాడు దేవయ్య

"తప్పకుండా   సముద్రపు వేటలొ "అలివి" అనే ప్రత్యేక విధానం వుంది. ధ్వని శాస్త్ర నిపుణుడు లాంటి "సడిగాడు"అనే వ్యక్తి ముందుగా పడవపై సముద్రంలోనికి వెళ్ళి  "సడికత్తావు" అనే తెడ్డును సముద్రపు నీటిలో ముంచి సడికత్తావు మరో కొనను చెవిదగ్గర పెట్టుకుంటాడు. ఆ సడికత్తావు నుండి చేపలు గుంపులుగా ఎక్కడ తిరుగుతున్నాయో అవి చేసే శబ్దతరంగాలను ఇట్టే  గ్రహించి అక్కడ వలవేయమని  చేతిరుమాలును ఊపుతాడు .అలివి యజమాని "సరంగి"కి చెపుతాడు. అప్పుడు సరంగి పడవపై ఒక కిలోమీటరు మేర తాడును వదులుతూ వెళతాడు దానిని" కొడి ఇవ్వటం" అంటారు.  ఆ తరువాత రెండు కిలోమీటర్లమేర రెండు అడుగుల వలను వదులుతారు. మధ్యలో పెద్దదైన మధ్యవల లేదా "మైపాల" ను వదులుతూ ఆంగ్ల అక్షరం "U " ఆకారంలో పడవను నడుపుతు వలను సముద్రంలో వదులుతారు . ఇప్పుడు రెండు కొసలను ఓ నలభైమంది "రైతులు" అనే పిలవబడే కూలీలు వలను అటూ ఇటూ  లాగుతూ అలివలో పడిన చేపలను ఒడ్డుకు చేరుస్తారు."

"అబ్బో అలివి వెనుక పెద్ద కథే ఉందన్నమాట"

ఆశ్చర్యపోతూ అన్నాడు దేవయ్య


"అంకుల్ మత్స్యకారుల ఆచారవ్యవహారాలు గురించి చెప్పండి?" దుప్పటి ముసుగు మరింత దగ్గరకు బిగిస్తూ అడిగాడు తేజ.


"మత్స్యకారులు దేవతలను ఆరాధిస్తారు. కాశమ్మోరు,నూకాలమ్మ,బంగారమ్మ, గంగమ్మ వీరి ప్రధానదేవతలు. క్రొత్త అమావాస్య రోజున వీరు ఒకరి దగ్గరనుండి మరోకరి దగ్గరకు పనిలోకి కుదురుతూ వుంటారు.హిందూ సాంప్రదాయ పద్దతిలోనే వివాహాలు చేసుకుంటారు.


"ఏదేమైనా నీటి మీద జీవనం ప్రమాదమే సుమండీ"అని సానుభూతిని వ్యక్తం చేస్తూ అన్నాడు దేవయ్య

"అవును దేవయ్యగారు తుఫానులు, సూనామీలు సంభవించి నప్పుడు ప్రాణనష్టం సంభవిస్తుంది. ఇప్పుడిప్పుడే శాస్త్రసాంకేతికతలను ఉపయోగించి చేపలు పట్టడం నేర్చుకుంటున్నారు."

భోజన పళ్ళెం పట్టుకువస్తూ "రండి అన్నయ్యగారు భోజనం చేసాక మాట్లాడుకుందాం అలా చూస్తారే అన్నయ్యగారికి చేతులు కడుగుకోటానికి నీళ్ళివ్వండి" అంటూ హడావిడి చేసింది కటాక్షం. 




 సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 



కాకినాడ కాజా

 కాకినాడ కోటయ్య కాజ


సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 



1857 సిపాయిల తిరుగుబాటు జరుగుతున్న కాలం. ప్రాణాలను తృణప్రాయంగా అర్పిస్తూ భరతమాత స్వేచ్చా వాయువులకోసం భారతవీరులు కరవాలాలు ఝళిపిస్తున్నారు  . ఆదే కాలంలో భారతదేశం అద్భుత ప్రతిభావంతులకు జన్మనిస్తున్న సమయం కూడా. తెలుగువీరుల గడ్డ గుంటూరు జిల్లా తెనాలి తాలూకా చిన్నపరిమి గ్రామంలో వ్యవసాయదారుల కుటుంబం ఓ ప్రతిభావంతుడికి జన్మనిచ్చింది.అతడే చిట్టిపెద్ది కోటయ్య .చిన్ననాటి నుండి కోటయ్యను తండ్రి తనకూడా పొలానికి తీసుకుపోవాలని ఆరాటపడేవాడు. పొలంపని అస్సలు ఇష్టం ఉండేది కాదు కోటయ్యకు . పదేళ్ళ వయస్సుకే  కోటయ్యలో నూతన ఆలోచనలు గజి బిజి చేయసాగాయి. అమ్మ పిండివంటలు చేస్తున్నప్పుడల్లా ఎంతో సంబర పడిపోయేవాడు.తనూ కూడా ఉండలు ఒత్తుతూనో , గరెటెలతో వండినవి పెనం నుండి దించుతుంటేనో  చెప్పలేని ఆనందం కలిగేది కోటయ్యకు.

 పొలంపనికి కోటయ్య రావటంలేదని ఆరోజు పెద్ద రాద్దాంతం చేసాడు కోటయ్య తండ్రి. పొలం పని ఇష్టంలేని కోటయ్య పదేళ్ళవయస్సులో అర్దరాత్రి ఇంటినుండి పారిపోయేడు. కన్నవారు కోటయ్య కోసం వెతకని ఊరులేదూ వెతకని చోటూలేదు. కోటయ్య పోయి పోయి తిరుపతి చేరుకున్నాడు. ఎలా బ్రతకాలో బ్రతకడానికి ఏంచెయ్యాలో తెలియని వయస్సు కోటయ్యది. దూరంగా ఏడుకొండలు కనిపిస్తూ ఉన్నాయి. అమ్మ ఏడుకొండలవాడా అంటూ పూజలు చేయడం గుర్తుకు వచ్చింది. ఇంతలో తన ముందర నుండి భక్తులగుంపు " ఏడుకొండలవాడా  వెంకటరమణా "  అంటూ కొండ ఎక్కడం చూసాడు.తను కూడా" ఏడుకొండలవాడా వెంకటరమణా " అంటూ  నడవడం మొదలెట్టాడు కోటయ్య . కొంత సేపటికి తిరుపతి కొండ ఎక్కలేక ఓ చెట్టు క్రింద కూలబడిపోయాడు. ఓ ప్రక్క ఆకలి దంచేస్తుంది. ఇంతలో ఓ భక్తుల బృందం కొండ దిగుతూ ఉంది. అందులో ఓ ముసలావిడ అలసిపోయి ఆకలితో దిగులుగా కూర్చున్న కోటయ్య దగ్గరకు వచ్చి చేతిలో తిరుపతి లడ్డు పెట్టింది. గబా గబా సగం తినేసాడు. అబ్బ ఎంత రుచిగా వుందో అనేలోపు లడ్డూతీపిలోని మాధుర్యానికి కోటయ్య  కనులు మెల్లగా మూతలు పడ్డాయి. కనులు తెరచి చూసే సరికి చెన్నపట్టణం అంటే ఇప్పుడు చెన్నై నగరంలో మంచం మీద పడుకుని ఉన్నాడు. వంటపాత్రల చప్పుడుకు మెలకువ వచ్చి గబ గబా మంచం దిగి గది బయటకు వచ్చి చూసాడు. అక్కడ చాలామంది పనివాళ్ళు రకరకాల మిఠాయిలు చేస్తూ ఉన్నారు. అక్కడ కుర్చీలో జారబడి వినసకర్ర విసురుకుంటూ ఉన్న బామ్మ కనబడింది. ఆ బామ్మే తనకు చేతిలో లడ్డు పెట్టిన బామ్మ అని గుర్తు పట్టాడు కోటయ్య . బామ్మ  కోటయ్యను చూడగానే లేచి దగ్గరకు వచ్చింది. "ఏం నాయనా ఇప్పటికి కళ్ళు తెరచావా. నీకు లడ్డూ పెట్టగానే తింటూనే  నిద్రపోయావు. నువు ఎవరో ఏంటో ఎవరిబిడ్డవో తెలియదు .అందుకే అక్కడ నిన్ను వదిలేయలేక తీసుకువచ్చాను మా ఇంటికి" అంటూ కోటయ్యకు గాలి విసురుతూ చెపుతుంది. కోటయ్యకు మెల్లగా అర్దమయ్యింది. బామ్మగారి బుగ్గన ముద్దుపెట్టాడు. బామ్మగారి మనస్సు వెన్నలా కరిగిపోయింది. తన వృత్తాంతమంతా చెప్పాడు బామ్మగారికి. "పాలుగారేలా ఉన్నావు నిన్ను కొడతాడా మీ నాన్న  వద్దులే అక్కడకు పోవద్దు ఇదిగో మా మిఠాయి దుకాణంలో రకరకాల వంటలు నేర్చుకుంటూ ఇక్కడే ఉండిపో" అంది. కోటయ్యకు బామ్మగారి ప్రేమాభిమానాలు మిఠాయి దుకాణం ఎంతో నచ్చేసింది. కోటయ్య నెల తిరిగేలోపే అన్ని రకారకాల మిఠాయిలు వండటం నేర్చేసుకున్నాడు. పన్నెండేళ్ళు గిర్రున తిరిగాయి. ఇరవై రెండేళ్ళ వయస్సు వచ్చేసరికి చిట్టిపెద్ది కోటయ్యకు ఇంటి వైపు మనసు లాగింది. అమ్మా నాన్నలను చూడాలనిపించింది. మెల్లగా బామ్మ దగ్గరకు పోయి " మా ఇంటికి వెళతాను" అని బామ్మతో చెప్పాడు. బామ్మకు ఏడుపు  ఆగలేదు కోటయ్య పట్ల ప్రేమ పెంచుకుంది మరి. బామ్మ కన్నీళ్ళు తుడుచుకుని "వెళ్ళు కోటయ్య మీ అమ్మ నీకోసం ఎంత ఏడుస్తుందో, ఎంత బెంగ పెట్టుకుందో" అంటూ గబగబా లోపలికి వెళ్ళి డబ్బులమూట తెచ్చి చేతిలో పెడుతూ దీవించి పంపింది.

  చెన్నపట్టణం మద్రాసుగా మారింది. మద్రాసు నగరం నుండి తెనాలి చేరి తన ఊరు చిన్నపరిమి చేరుకున్నాడు. ఇంటి ముందుకు వెళ్ళి "అమ్మా ! నాన్నా !" అంటూ బిగ్గరగా పిలిచాడు కోటయ్య. ఎన్నాళ్ళగానో  ఆ పిలుపుకోసమే ఎదురు చూస్తున్న కోటయ్య తల్లిదండ్రులు గబగబా బయటకు వచ్చి నూనూగు మీసాల కోటయ్యను చూసి గుర్తుపట్టి  కౌగిలించుకున్నారు. ఒళ్ళంతా తడుముతూ ముద్దాడుతూ తనివితీరా ఏడ్చారు. క్షమించమని తండ్రి కన్నీళ్ళు పెట్టుకున్నాడు. అమ్మా నాన్నల కాళ్ళకు నమస్కరించి లోపలికి నడిచాడు కోటయ్య.

          కోటయ్యకు తల్లిదండ్రులు అనసూయతో పెండ్లి జరిపించారు. కోటయ్య తెనాలిలో మిఠాయి దుకాణం తెరిచాడు. అనతికాలంలోనే మంచి మిఠాయి దుకాణంగా పేరుతెచ్చుకుంది. అయితే ప్రతిభావంతులు ఎప్పుడూ చేతులు కట్టుకు కూర్చోరు. తన పనిలో గొప్పదనం కోసం నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు. కోటయ్య మనస్సు నూతన ఆవిష్కరణకు ప్రయత్నిస్తుంది. ఒక రోజు పిండితో కుస్తీ పడుతున్న కోటయ్యను చూసి భార్య "ఏం చేస్తున్నారండి" అంది. "అనసూయ మనం అమ్మే తినుబండారాలు అందరి దగ్గరా దొరికేవే నాకంటూ ఓ ప్రత్యేకత ఉండాలి అందుకు ఓ కొత్తరకం వంటకు ప్రయత్నిస్తున్నాను" అన్నాడు కోటయ్య "అసలు మీ ఆలోచన ఏంటో చెప్పవచ్చుకదా " " ఏం లేదు అనసూయ కొరికితే పాకం కారాలి  దానిని చూస్తుంటే  లోపల పాకం ఉన్నట్టు కనబడకూడదు నొక్కితే గట్టిగా ఉండాలి" అన్నాడు కోటయ్య. "ఏంటి ఏంటి విడ్డూరంగా ఉందే "బుగ్గలు నొక్కుకుంటూ కళ్ళు పెద్దవి చేస్తూ కోటయ్య ప్రక్కన పీట వేసుకు కూర్చుంది అనసూయ. "ఏలా చేస్తారు మరి"  "ఏం చేస్తానంటే  ఇదిగో మైదాపిండి  కేజి తీసుకున్నాను దీనికి  ఓ వంద గ్రాములు పచ్చి సెనగపిండి కలుపుతాను." "మైదాలో సెనగపిండి బలేగుందండి"  "అనసూయ నిన్న నువు తయారుచేసిన గుమగుమలాడే నెయ్యి తీసుకురా" అన్నాడు కోటయ్య. అనసూయ లేడిలా వంటగదిలోకి పరిగెత్తి నెయ్యి డబ్బా తెచ్చింది. కోటయ్య అందుకుంటూ  ఇందులో వందగ్రాముల నెయ్యి వేస్తాను. వేసి ఇదిగో నెయ్యితో పిండిని పాలిష్ చేసినట్టు కలుతాను. అంటూ రెండు చేతులలోనికి పిండిని తీసుకుని నలపడం మొదలెట్టాడు. ఓ పదినిమిషాలు

నెయ్యిని మొత్తం పిండికి పట్టించాడు.

"ఆ తరువాత ఏం చేస్తారు"  ఆతృతగా అడిగింది అనసూయ. "వంటసోడా ఓ ఇరవై గ్రాములు వేస్తాను". "నాకు తెలుసు వంటసోడా వేస్తే పొంగుతాయి కదా" అన్నది అనసూయ . "ఆ అవును అందుకే వేస్తాను. వేపినప్పుడు కరకరలాడడానికి కాస్త డాల్డ కూడా కలుపుతాను."  "మీ బుర్రే బుర్రండీ" మెచ్చుకుంటూ సాయంచేస్తుంది కోటయ్యకు భార్య అనసూయ. "కాస్త  నీళ్ళుపొయ్యి "అన్నాడు. అనసూయ  పిండిలో ఇత్తడి చెంబులో ఉన్న నీళ్ళు పోసింది. "ఇప్పుడు పిండిని కలిపి కలిపి ముద్దలా చేస్తాను చేయడమే కాదు ఓ అరగంటసేపు పిండిముద్దను ఎత్తి కుదేస్తాను" అంటూ పళ్ళెం కేసి బాదడం మొదలెట్టాడు కోటయ్య .  ఇలా చేస్తున్నాడే కాని అలా వండాలని కోటయ్యకూ తెలియదు ప్రయత్నిస్తూన్నాడంతే. కోటయ్యకు చేతులు నొప్పి పుట్టాయి. అనసూయ  కోటయ్య అలసిపోవడం చూసి "పైకి లేవండి బాదింది చాలుగాని చేతులు కడుక్కొని భోంచేయండి అంది." కోటయ్య అవస్దను చూసి నవ్వుకుంటూ . వంటగదిలోకి వెళ్ళి భోజనం పళ్ళెం తెచ్చి పీటమీద పెట్టింది. కలిపిన పిండి ముద్దను ప్రక్కన పెట్టి  దానిపై గుడ్డను కప్పాడు కోటయ్య. కోటయ్యకు తెలియదు అలా కొంత సేపు  పిండిముద్దను కదపకుండా ఉంచితే చక్కగా మృదువుగా అవుతుందని.

"భోజనం చేస్తున్నాడే గాని కోటయ్య "తరువాత ఏంచేయాలి ? అని ఆలోచిస్తుంటే ఒక్కసారిగా పొలమారింది కోటయ్యకు. అనసూయ కోటయ్యకు మంచి నీళ్ళ చెంబు అందిస్తూ "  నాకు తెలుసు మన కాకినాడ చూట్టాలే తలుచుకుంటున్నారు. మొన్న దీపావళికి వచ్చినప్పుడు నాతో చెప్పారు.  కాకినాడలో మంచి మిఠాయి దుకాణం ఏదీ లేదు మీరు అక్కడకు వచ్చేయవచ్చు కదా. తెనాలి బాగా చిన్నఊరు  కాకినాడ అయితే మీవ్యాపారం పెద్దదవుతుందని " అంటూ చుట్టాలు సలహ ఇవ్వడం చెప్పింది కోటయ్యకు. భోజనం ముగించిన కోటయ్య చేయి కడుగుకుంటూ  "నాకు అలాగే అనిపిస్తుంది అనసూయ మద్రాసులో చూసాను కదా  ఎంత పెద్దనగరమైతే వ్యాపారం అంత పెద్దగా సాగుతుంది. వెళదాము గాని ముందు మనకంటూ ఓ ప్రత్యేకమైన వంటకం ఉండాలి. నేను అనుకున్న వంటకం బాగా వస్తే రేపే ప్రయాణం " అన్నాడు కోటయ్య. "ఇంకెందుకు ఆలస్యం మొదలెట్టండి" అంది అనసూయ సంబరపడిపోతూ. పిండిముద్దను పీటపై వేసుకున్నాడు" ఏం చెయ్యాలి ఇప్పుడు  చేసేది ఏదైనా నేతి వంటకమే ఉండాలి అలాగే చేతిలో ఇమడాలి అంటే వ్రేలంత పొడవుంటే చాలు  అనుకుని ఒక్కసారిగా వచ్చిన ఆలోచనతో  "అనసూయ  ముందు పొయ్యి వెలిగించి పెనం మీద కళాయి పెట్టి నెయ్యి మరిగించు" అన్నాడు. "అదేంటండి నెయ్యంతా మరిగిస్తే రేపు వంటలకో" అంది అనసూయ . "మాట్లాడకు మన దశ తిరగబోతుంది బ్రహ్మండమైన ఆలోచన వచ్చింది." అంటూ కోటయ్య పిండిముద్దను సన్నని గొట్టంలా చేసి ముక్కలు ముక్కలుగా ఇనపరేకు తో కోసాడు. ఇంతలో కళాయిలో నెయ్యి వేడెక్కింది. కోటయ్య పిండి ముక్క తీసుకుని వేలితో ఓ నొక్కు నొక్కి అప్పడాలు వత్తే కర్రతో అదిమి ఆ పిండి ముక్కను మరిగే నెయ్యిలో వేసాడు. అంతే  బుడగలాగ పొంగింది. కోటయ్య అనుకున్నది వచ్చేసింది. భార్య అనసూయ "ఇదేంటండి గొట్టంలా వుంది" అంది. "అవును గొట్టాలే " గబగబా ఓ యాబై గొట్టాలు తయారు చేసాడు కోటయ్య. " అనసూయ గొట్టాలు బంగారు రంగులోకి మారేసరికి గరిటె బెట్టి గొట్టాలు పళ్ళెంలోకి తీసేయ్ " అన్నాడు . అనసూయ కంగారుపడుతూ గొట్టాలను కళాయినుండి తీసి పళ్ళెంలో వేసింది.. "అదేంటండి అప్పుడే దించేయమన్నారు." " చెపుతాను గాని  నువ్వు  

కేజి పంచదార తీసుకుని దానికి సమానమైన నీరు పోసి పంచదార పాకం పట్టు " అన్నాడు.  అనసూయ కోటయ్య చెప్పినట్టే పంచదార పాకం పట్టింది మారు మాట్లాడకుండా. ఇంతలో కోటయ్య గొట్టాలు అన్నీ ఒకేసారి  మరలా నెయ్యికళాయిలో వేసి గరెటెతో త్రిప్పుతూ గొట్టాలను ఎగరేస్తూ ఉన్నాడు. "అనసూయ అదేంటండి అలా ఎగరేస్తున్నారు మతిగాని పోయిందా" అంది కోటయ్య చేసేది అర్దంకాక." "నాకు మతి పోలేదోయ్  ఎందుకు ఎగరేస్తున్నానంటే గొట్టాలు గలగల శబ్దం చేసే వరకూ వేగాలని"  అంత గట్టిగా వేపితే పాకం ఎలా పడుతుంది అని మనస్సులో అనుకుంటూ "బాగానే ఉంది కాని పాకం వేడి తగ్గిపోతుంది" అంది అనసూయ. 

"తగ్గితేనే మంచిది అనసూయ గొట్టాలు వేడిగా పాకం వేడితక్కువగా ఉంటే గొట్టాలలోకి పాకం ఎక్కువ పడుతుంది" అన్నాడు కోటయ్య. 

భర్త కోటయ్య అనుకున్నది సాధించినట్టే ఉన్నాడనిపించింది అనసూయకు. 

"అనసూయ రాత్రి నువు పడుకున్నాక జార అని తయారు చేసాను అది బయట అరుగుమీద ఉంది పట్టుకురా" అన్నాడు. ఇదెప్పుడు చేసాడు రాత్రంతా నిద్రపోలేదన్నమాట అనుకుంటూ భర్త ప్రయత్నానికి తనవంతు సాయం అందిస్తూ ఉంది అనసూయ. గరెటెలో మైదాపిండితో చేసిన గొట్టాలు గలగలలాడుతున్నాయ్  కోటయ్య ముఖం ఆనందంతో విప్పారింది. గొట్టాలను పంచదారపాకంలో వేసి జారతో ఓ నిమిషం నొక్కి బయటకు తీసాడు చిట్టిపెద్ది కోటయ్య.

     భార్య అనసూయ ముఖం చిన్నబోయింది . గొట్టం గొట్టంలాగే వుంది  ఏం ప్రత్యేకత వుంది ఇందులో అనుకుంది. కోటయ్య భార్యకు ఓ గొట్టం ఇచ్చి తినమన్నాడు. భర్త శ్రమను చూసి వద్దనలేక వంటకం సరిగా రాలేదు పాపం అనుకుంటూ  గొట్టాన్ని పళ్ళమధ్య పెట్టి కొరికింది.  అంతే ఒక్కసారిగా నోటినిండా పాకం జలజలా కారింది. అనసూయ ఆశ్చర్యానికి అంతులేదు. కోటయ్య అనుకున్నది సాధించాడు. బయటకు మామూలుగా గట్టిగా కనిపిస్తుంది గొట్టం కాని నిండా పాకమే. పాకం గొట్టం లోపలికి ఎలా వెళ్ళిందో ఎవరికీ తెలియదు. బలే వంటకం."ఏమండీ దీనికి ఏం పేరు పెడతారు ? " అని అడిగింది. "అనసూయ దీనికి " కాజ "అని పేరు పెడతాను. "గొట్టం కాజా అంటారా" " లేదు ఇది కాకినాడ కాజా " అని ప్రసిద్ది చెందుతుంది అన్నాడు కోటయ్య . భర్త ఉద్దేశ్యం అర్దమయ్యింది కాకినాడలో అమ్మడం మొదలు పెడతారన్నమాట అని అనుకుంది అనసూయ.  భర్తను మురిపెంగా చూస్తూ "ఏమండి మీరు తయారు చేసిన ఈ వంటకం వందేళ్ళపాటు ప్రపంచ ప్రసిద్ది చెందుతుంది "అంటూ భర్త కోటయ్య నుదిటికి పట్టిన చెమటను పైట చెంగుతో తుడిసింది అనసూయ. 

  1891  కాకినాడ కోటయ్య కాజా  దుకాణం తెరవడానికి కాకినాడ మెయిన్ రోడ్డులో అడుగు పెట్టాడు మన కోటయ్య. అలా కాకినాడ కాజాను ఐదు తరాలనుండి వారి వంశీకులు తయారు చేస్తూనే ఉన్నారు. దేశ విదేశాలలోని ప్రజలు నిత్యనూతన స్వీటుగా  పెళ్ళిళ్ళలోను, పండగలకు, విందు వినోదాలలోను కాకినాడ కోటయ్య కాజాను ఆదరిస్తూనే ఉన్నారు.


సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 


       

పాకం గారెలు


కొత్త పెరుమాళ్ళపురం పాకం గారెలు


సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 


    జాను, రాములు సముద్రపు ఒడ్డున పీతలతో ఆడుకుంటున్నారు. పీతలు కన్నాలలోకి వస్తూ పోతూ ఉంటే సరదా పడి పోతూ ఆడుకుంటున్నారు.

"ఒరే జాను నీ చొక్కామీద ఆ మరకలేమిటిరా?"

అడిగాడు రాములు. "నిన్న మా అక్క కొత్త పెరుమాళ్ళపురం నుండి పాకం గారెలు తెచ్చిందిరా అవి తింటుంటే పాకం కొద్దిగా చొక్కా మీద పడింది" అన్నాడు శీను.

పాకం గారెలు మాట వినగానే రాములు నోరు ఊరింది. "జాను మీ అక్కను పరిచయం చేస్తావా మీ ఇంటికి వస్తాను" అన్నాడు రాములు." నాకు తెలుసులేరా నువ్వు ఎందుకు మా ఇంటికి వస్తానంటున్నావో మా అక్క కోసం కాదులే పాకం గారెలకోసం" అంటూ కిలకిల నవ్వేశాడు జాను. "పోరా నువ్వు నన్ను అలాగే ఆటపట్టిస్తావు" అంటూ సిగ్గు పడిపోయాడు రాములు. 

  జాను, రాములు గబా గబా అంగలు వేసుకుంటూ ఇంటికి చేరుకున్నారు. అక్కడ అమ్మలిక్కలందరూ జాను అక్కయ్య ప్రేమతో ముచ్చటిస్తూ ఉన్నారు. వారి సంభాషణ వింటూ చప్పుడు చేయకుండా అరుగుమీద కూర్చున్నారు స్నేహితులిద్దరూ.జాను అక్క  ప్రేమావతి కొత్తపెరుమాళ్ళపురం పాకం గారెల గురించి చెపుతూ " కొత్త పెరుమాళ్ళపురం పాకం గారెలు బలే తీపిగా ఉంటాయి. మనం ఇళ్ళల్లో చేసుకునే పద్దతే అయినా వీటి ప్రత్యేకతే వేరు.  నానబెట్టిన మినుములను మెత్తగా రుబ్బి చిట్టి చిట్టి మినపగారెలుగా వేసి దోరదోరగా వేయిస్తారు. కట్టెల పొయ్యి మీద సన్నని సెగమీద వండుతారు.కొద్దిసేపటి తరువాత పంచదార పాకంలో వేసి తీస్తారు. గారెలలోనికి పాకం ఊరి తినగానే పసందైన రుచిని కలిగిస్తుంది. వేడి వేడి గారెలు తినడానికి చాలా మంది సుదూరం ప్రయాణించి వస్తూఉంటారు. ఇక రాష్ట్రంలో జరిగే పెద్ద పెద్ద సభలలొ జరిగే విందుల్లో కొత్త పెరుమాళ్ళపురం పాకం గారెలు ఉండవలసిందే. కాకినాడ బీచ్ ఫెస్టివల్స్ జరిగినప్పుడు స్టాల్ పెట్టి అమ్ముతూ ఉంటారు కూడా. పది రూపాయలకు మూడు గారెలు ఇస్తారు. ఇంతకీ  ఇదేదో పెద్ద మిఠాయి దుకాణం అనుకున్నారు ఓ చిన్న పూరిపాకలో ఓ ముసలమ్మ  తన కూతురు కలసి వండే వంటకం  అంటే ఆశ్చర్యపోవలసిందే మరి " అంటూ చుట్టూ చేరిన వారికి తలో ఒక పాకం గారె పంచి పెట్టింది ప్రేమావతి. రాములు గబా గబా అందుకుని  గుట్టుక్కున బుగ్గలో పెట్టి నమిలేస్తూ బాగుందని తలాడించాడు జానుని చూసి నవ్వుతూ.


సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

స్కూల్ అసిస్టెంట్ 

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకొత్తపల్లి,

కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా 


Monday, October 26, 2020

నన్ను ఒకాయనన్నాడు  మీరు సాదారణ స్కూల్ ను డిస్టబెన్స్ చేస్తున్నారని


నేనన్నాను



లెనిన్  

భగత్ సింగ్  

అల్లూరి

గాంధీ

కందుకూరి



అందరూ డిస్టబెన్స్ గాళ్ళే

అందులో నేనూ ఒకడిని అని😊

నా అనుభవాలు 1

 లా జవాబు నహీ


నేను ఒక ఊరి బడికి బదిలీపై వెళ్ళాను. నా ప్రతిభతో అనతి కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నాను. నా వయస్సు సీనియారిటీని బట్టి నన్ను అన్నిటిలో  ముందు ఉంచేవారు. అది నచ్చని ఓ జూనియరు టీచరకు నేనంటే గిట్టేది కాదు. ఒక రోజు అందరూ  స్టాఫ్ రూంలో కూర్చునుండగా నేను అర్జంటగా అవసరమై సెలవు పెట్టి వెడుతుంటే  ఆ జూనియరు టీచరు

అందరూ నవ్వేలా  "రాజు వెడలే రవితేజము లదరగా" అంటూ పాడపాడాడు.  అది నా కోసమే హేళనగా పాడాడని తెలుసు. నేను మౌనం వహించాను . కాలమే సమాధానం చెపుతుందని అనుకున్నాను.  అందరం బదిలీలపై వేరే బడులకు వెళ్ళాం. ఆ జూనియరు టీచరు  బదిలీపై వెళ్ళిన బడిలో  పదవ తరగతి అమ్మాయిని వేదిస్తూ అర్దరాత్రి సరాసరి ఇంటికి పోతే ఆ జూనియరు టీచరును చెట్టుకు కట్టి కుక్కను కొట్టినట్లు కొట్టారని తెలిసింది . బదిలిపై పోవలసిందిగా గ్రామస్తులు హుకుం జారీచేసారని కూడా తెలిసింది. తరువాత బదిలి పై వెడుతూ రిలీవింగ్ తీసుకుంటుంటే  జూనియరు టీచరు సెల్ కు నేను  ఇలా మెసేజ్ పెట్టాను "రాజు వెడెలె రవితేజము లదరగ"

 మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా...